ఖిలావరంగల్, ఆగస్టు 13 : చారిత్రక ఓరుగల్లు కోటలో భారత వజ్రోత్సవాలను నిర్వహించేందుకు ఏ ర్పాట్లు చేస్తున్నారు. స్వరాష్ట్రంలో 2014 ఆగస్టు 15న తొలిసారి ఖిలావరంగల్ ఖుష్మహల్ ప్రాంగణంలో స్వాతంత్య్ర వేడుకలు వైభవంగా నిర్వహించారు. కా గా, పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు వేరైన తర్వా త వరంగల్ జిల్లా కేంద్రంగా మరోసారి ఖుష్మహల్ ప్రాంగణంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 75వ స్వాతంత్య్ర ఉత్సవాలు జరిగే ఖుష్మహల్ మై దానంతో పాటు కోటను ముస్తాబు చేసే పనిలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఖిలావరంగల్కు వచ్చే ప్రధాన రహదారులకు మరమ్మతులు చేపట్టారు. ఇప్పటికే జంక్షన్లు, పోలీసు స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల విద్యుత్ లైట్లతో అలంకరించారు. ఇక ఖుష్మహల్ ప్రాంగణంలో వీఐపీలు, కళాకారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూర్చునేందుకు వీలుగా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసుల కవాతుకు సంబంధించిన పనులు జోరుందుకున్నాయి. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాళ్లు, శకటాలపై ఇప్పటికే కలెక్టర్ బీ గోపి అధికారులతో చర్చించారు. ఖుష్మహల్ ప్రాంగణాన్ని సందర్శించి వేడుకలు ఘనంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
54 అడుగుల జాతీయ జెండా..
కాకతీయుల కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసిన కీర్తి తోరణాల ప్రాంగణంలో 54 అడుగుల ఎత్తులో భారీ జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు చేస్తున్న ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ఈ జాతీయ జెండా చారిత్రక ఖిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఇప్పటికే వరంగల్ రైల్వేస్టేషన్ ప్రాంగణంలో వంద అడుగుల ఎత్తయిన జాతీయ జెండా రెపరెపలాడుతూ జాతీయ సమైక్య స్ఫూర్తిని నింపుతోంది.
జోరందుకున్న ఫసాడ్ లైట్ల పనులు..
కోటలోని చారిత్రక కట్టడాలకు ఏర్పాటు చేస్తున్న ఫసాడ్ లైట్ల పనులు జోరందుకున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖుష్మహల్తోపాటు రాతికోట ఉత్తర ద్వారం వద్ద ఫసాడ్ లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులు రంగురంగుల విద్యుత్ దీపాల వెలుతురులో ఫొటోలు దిగుతూ మురిసి పోతున్నారు. ఫ్రసాడ్ లైట్ల వెలుగులతో కోట ప్రాకారాలు, కట్టడాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రాతికోట తూర్పు, పశ్చిమ, దక్షిణ సింహద్వారాల వద్ద కూడా ఈ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 15న ఫసాడ్ లైట్లను పూర్తి స్థాయిలో వెలిగించేందుకు పనులను వేగవంతం చేశారు. మరోసారి కోటలో పంద్రాగస్టు వేడుకలను నిర్వహిస్తుండడంతో స్థానికులు, పర్యాటకులు హర్షం వ్యక్తం చేశారు.