ఖానాపురం/దుగ్గొండి/నర్సంపేట/నర్సంపేటరూరల్/రాయపర్తి, ఆగస్టు 7: శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం ఊరూరా బోనాల వేడుకలు నిర్వహించారు. ఖానాపురం మండలంలోని ధర్మారావుపేటలో సర్పంచ్ వెన్ను శ్రుతి మహిళలతో కలిసి బోనాలను నెత్తిన ఎత్తుకొని డప్పుచప్పుళ్ల మధ్య ర్యాలీగా పోచమ్మ ఆలయానికి తరలివెళ్లారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో వెన్ను పూర్ణచందర్, గ్రామస్తులు పాల్గొన్నారు. మండలంలోని అశోక్నగర్లో నేతగాని కులస్తులు కులదైవమైన ముత్యాలమ్మతల్లికి బోనాలు సమర్పించారు. కులపెద్దలు చెన్నూరి సారంగపాణి, జనగాం రమేశ్ పాల్గొన్నారు. దు గ్గొండి మండలవ్యాప్తంగా పోచమ్మతల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తిమ్మంపేట, మందపల్లి, శివాజీనగర్లో ప్రజలు డప్పుచప్పుళ్ల మధ్య ఊరి పొలిమేరల్లోని పోచమ్మ ఆలయానికి శివసత్తుల పూనకాలతో నృత్యాలు చేస్తూ తరలివెళ్లారు. అనంతరం అమ్మవారికి చీరె, జాకెట్ను కానుకగా అందించి నైవేద్యం సమర్పించారు. తర్వాత కోళ్లు, గొర్రెలను బలిచ్చారు. అనంతరం బంధుమిత్రులను ఇండ్లకు ఆహ్వానించి విందుభోజనం ఏర్పాటు చేశారు.
నర్సంపేటలో పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పోచమ్మ, ముత్యాలమ్మకు బోనంతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వరంగల్రోడ్డులోని పోచమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. కుటుంబ సమేతంగా తరలివచ్చి చీరెలు, కానుకలు సమర్పించారు. నర్సంపేట మండలంలో ప్రజలు పోచమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నర్సంపేట సర్వాపురం శివారు పోచమ్మ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయపర్తి మండలం రాయపర్తి, మైలారంలో మత్స్యకార్మిక కుటుంబాలు బోనాలతో మారెమ్మ ఆలయానికి ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం కొండూరు రోడ్డులోని ముత్యాలమ్మ ఆలయానికి చేరుకుని బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. మైలారంలో ముదిరాజ్లు పెద్దమ్మతల్లికి బోనాలు చెల్లించారు. మత్స్యపారిశ్రామిక సంఘం రాయపర్తి అధ్యక్షుడు పిల్లి కొమురయ్య, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పిల్లి రవీందర్, ఉపాధ్యక్షుడు మల్లయ్య, కార్యదర్శి వీ మహేందర్, పూజారి సంతోష్కుమార్, శ్రీనివాస్, సాగర్ పాల్గొన్నారు.