కాశీబుగ్గ/చెన్నారావుపేట/రాయపర్తి/కరీమాబాద్, ఆగస్టు 2: తల్లిపాల ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఐసీడీఎస్ అధికారులు, వైద్యులు సూచించారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వాడవాడలా అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వరంగల్ 18వ డివిజన్ ప్రతాప్నగర్ కమ్యూనిటీ హాల్లో తల్లిపాల ప్రాముఖ్యత తెలియజేశారు. కార్పొరేటర్ బాబు, సీడీపీవో విశ్వజ, డీడబ్ల్యూవో శారద, రవితేజ, సృజన, ఛాయాదేవి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. చెన్నారావుపేటలోని ఐకేపీ భవనంలో అంగన్వాడీ టీచర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో దయాకర్, సీడీపీవో విద్య మాట్లాడుతూ తల్లిపాలల్లో ఉండే పోషకాలపై బాలింతలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజేందర్, సూపర్వైజర్ మంజుల, పోషన్ అభియాన్ కోఅర్డినేటర్ పాల్గొన్నారు. రాయపర్తి మండలంలోని దుబ్బతండా పరిధిలోని తండాల్లో బాలింతలు, గర్భిణులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు అవగాహన సదస్సులు నిర్వహించారు.
క్లస్టర్ సూపర్వైజర్ సత్యవతి మాట్లాడుతూ తల్లిపాలే బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయన్నారు. కార్యక్రమాల్లో దుబ్బతండా సర్పంచ్ దేదావత్ కమలమ్మ, సంగీత, నాగమణి, మంగమ్మ పాల్గొన్నారు. అంతేకాకుండా ఐసీడీఎస్ సూపర్వైజర్ పెరుమాండ్ల ఆశాదేవి ఆధ్వర్యంలో వరంగల్ 39వ డివిజన్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీవో విశ్వజ మాట్లాడుతూ తల్లిపాలతోనే పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ బత్తిని రమాదేవి ఆధ్వర్యంలో 40వ డివిజన్లోని ఉర్సు సీఆర్సీ సెంటర్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మరుపల్ల రవి మాట్లాడుతూ పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలని సూచించారు.