వరంగల్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : నేతన్నల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘నేతన్న బీమా’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవ కానుకగా ఈ పథకాన్ని అమలు చేయనుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా చేనేత కార్మిక కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. 60ఏళ్ల లోపు చేనేత కార్మికులందరికీ బీమా చేయించనుంది. మరమగ్గాలు, పవర్లూమ్లపై పనిచేసే కార్మికులకు సైతం ఈ పథకం వర్తించనుంది. వరంగల్లో 1730 మంది, హనుమకొండలో 875 మంది, భూపాలపల్లిలో 1245, జనగామలో 700 మంది చేనేత కార్మికులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మరో 300 మంది మరమగ్గాల కార్మికులు ఉన్నారు.
నోడల్ ఏజెన్సీగా చేనేత జౌళి శాఖ
చేనేత, పవర్లూమ్ కార్మిక కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో నేతన్నకు బీమా పథకాన్ని రూపొందించారు. ఈ పథకం అమలుకు చేనేత, జౌళిశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. పథకం అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం ఎల్ఐసీతో ఒప్పందం చేసుకుంది. వార్షిక ప్రీమియం కోసం చేనేత, పవర్లూమ్ కార్మికులు రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం మొత్తాన్ని ఎల్ఐసీకి చెల్లించనుంది. ఇందుకోసం రూ.50 కోట్లు కేటాయించినట్లు ప్రకటించిన మంత్రి కేటీఆర్, ఇప్పటికే రూ.25కోట్లు విడుదల చేశారు. బీమా కాలంలో లబ్ధిదారులు ఎవరు చనిపోయినా నామినీకి రూ.ఐదు లక్షలు అందిస్తారు. చనిపోయిన తర్వాత 10రోజుల్లోనే బీమా మొత్తం నామినీ ఖాతాలో జమ చేస్తారు. 18 నుంచి 59 ఏళ్ల వయసులోపు చేనేత, మరమగ్గాల కార్మికులు, అనుబంధరంగాల వారికి ఈ పథకం వర్తిస్తుంది.
వరంగల్లోనే అత్యధికం
వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా చేనేతకార్మికులు ఉన్నారు. జిల్లాలో 28 చేనేత సహకార సంఘాలున్నాయి. ఒక్కో సంఘంలో 100 నుంచి 500 మంది సభ్యులున్నారు. ప్రధానంగా వరంగల్లోని కొత్తవాడ, ఆటోనగర్, దేశాయిపేట, కాశీబుగ్గ, కరీమాబాద్ తదితర ప్రాంతాలు, వర్ధన్నపేట, రాయపర్తి తదితర మండలాల్లో చేనేత, మరమగ్గాల కార్మికులున్నారు. పొదుపు పథకంలో 1,780 మంది చేరారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులందరికీ నేతన్న బీమా పథకం వర్తిస్తుందని చేనేత, జౌళిశాఖ వరంగల్ జిల్లా అధికారి రాఘవరావు చెప్పారు. హనుమకొండ జిల్లా పరిధిలో 500 మంది నేత కార్మికులు లబ్ధిపొందనున్నారు. ఇప్పటికే త్రిఫ్ట్ పథకంలో జిల్లా పరిధిలో 875 మంది ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 1245 మంది నేత కార్మికులు ఆయా సొసైటీల్లో సభ్యులుగా ఉండగా 817 మందికి పింఛన్ అందుతున్నది. జిల్లాలోని మొగుళ్లపల్లి , రేగొండ, చిట్యాల, టేకుమట్ల, కాటారం, మహదేవపూర్ మండలాల్లో ఎక్కువగా నేతకార్మికులున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేటలోనూ అధికంగా ఉన్నారు. బీమా పథకానికి కార్మికులు స్వయంగా దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదు. జిల్లాల వారీగా ఉన్న చేనేత కార్మికుల వివరాల ఆధారంగా ఎంపిక చేసి చేనేత, జౌళిశాఖ అధికారులు పథకాన్ని వర్తింపజేయనున్నారు.
బీమా ఇస్తామనడం సంతోషం..
నేను 35ఏళ్లుగా చేనేత కార్మికునిగా పనిచేస్తున్నా. చేనేత సహకార సంఘంలో డైరెక్టర్గా పనిచేసిన. ప్రభుత్వం చేనేత కార్మికులకు బీమా కల్పించడం సంతోషంగా ఉంది. మా చేనేత సహకార సంఘంలో 530మంది కార్మికులు ఉన్నారు. కార్మికుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత కార్మికులకు ఉచిత బీమా కల్పించడం అభినందనీయం. గతంలో కేంద్ర ప్రభుత్వం జనశ్రీ బీమా పెట్టినా కార్మికులకు ఎలాంటి లాభం చేకూరలేదు. కార్మికులు చనిపోతే అంత్యక్రియల ఖర్చుల కోసం మా చేనేత సంఘమే కొంత ఆర్థిక సహాయం అందిస్తుంది.
– చేరాల సారంగం, చేనేత కార్మికుడు, కమలాపూర్
కొండంత ధీమా
చేనేత సంఘంలో నేను 25ఏళ్లుగా పనిచేస్తున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబీమా తరహాలో చేనేత కార్మికులకు రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించి చేనేత దినోత్సవం సందర్భంగా ప్రారంభిస్తామనడం సంతోషంగా ఉంది. చేనేత కార్మికుల కుటుంబాలు సరైన కూలీ గిట్టుబాటు గాక కుటుంబం గడవడం కష్టంగా ఉంది. రోజురోజుకూ నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల కూలీ డబ్బులు సరిపోవడం లేదు. ప్రభుత్వం ఉచితంగా బీమా కల్పించడం వల్ల మా కుటుంబాలకు కొండంత ధీమాగా ఉంటుంది.
– కోమాకుల పోశాలు, చేనేత కార్మికుడు, కమలాపూర్
నేతన్నలను గుర్తించింది కేసీఆరే..
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నేత కార్మికుల బతుకులు గాడిలో పడ్డాయి. చేనేత పరిశ్రమకు ప్రభుత్వం చేయూతనందించి ప్రోత్సహిస్తున్నది. కార్మికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుండడం వల్ల కార్మికులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. సాంచాలకు ప్రాణం పోసినట్లవుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి బీమా కల్పించడం శుభపరిణామం.
– దాసరి సుదర్శన్, చేనేత కార్మికుడు, భూపాలపల్లి
కష్టకాలంలో భరోసా..
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న నేతన్న బీమా పథకంతో కార్మిక కుటుంబాల్లో భరోసా నింపుతుంది. అనేక మంది నేత కార్మికులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంటి పెద్ద చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేత కార్మికుల పరిస్థితిని అర్థం చేసుకొని బీమాతో ఆదుకుంటామనడం చాలా సంతోషంగా ఉంది. రైతుబీమా తరహాలో ఈ బీమా నేత కుటుంబానికి ఆర్థిక భరోసానిస్తుంది.
– షేర్ కుమారస్వామి, చేనేత కార్మికుడు, భూపాలపల్లి
ఆదినుంచీ అండగా
చేనేత కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదినుంచీ అండగా నిలుస్తున్నది. మిత్ర ద్వారా నూలు, సిల్క్, ఉన్ని, రంగులు, రసాయనాలపై కేంద్ర ప్రభుత్వం 10 శాతం రాయితీ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఇచ్చి నేతన్నలను ఆదుకుంటున్నది. నేతన్నకు చేయూత పథకంలో నేత కార్మికులు 8 శాతం పొదుపు చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం 16 శాతం చెల్లిస్తున్నది. ఇప్పుడు చేనేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలన్న లక్ష్యంతో నేనత్న బీమా పథకాన్ని అమలు చేస్తుండగా సంబంధిత కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. గత ప్రభుత్వాలు చేనేత కార్మికులను పట్టించుకోలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే చేనేత కార్మికుల సంక్షేమానికి అనే పథకాలు అమలు చేస్తున్నదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.