వరంగల్ చౌరస్తా, ఆగస్టు 2 : వైద్య సేవలను ట్రాన్స్జెండర్స్ సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ బీ గోపి సూచించారు. రాష్ట్రంలోనే మొటిసారిగా ఎంజీ ఎం ఓపీ విభాగంలో మంగళవారం ట్రాన్స్జెండర్స్ క్లినిక్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. డెర్మటాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఎండోక్రైనాలజీ, ఎస్టీడీ, హెచ్ఐవీ విభాగాధిపతుల పర్యవేక్షణలో వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. హార్మోన్ల అసమతుల్యతతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్స్కు మొదటి దశలోనే వైద్యం అందిస్తే హార్మోన్ల సమతులత్యను సాధించవచ్చని అన్నారు. చిన్న పిల్లల్లో హార్మోన్ల సమస్యలను గుర్తించడానికి తల్లిదండ్రులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ విభాగంలో వైద్యసేవలు పొందేవారికి ఉచిత ల్యాబ్ సౌకర్యంతోపాటు మందులు అందిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తం గా వివిధ జిల్లాల్లో ఉన్న సుమారు 60 వేల మంది ట్రాన్స్జెండర్స్ సేవల వివరాలను అందుబాటులో ఉంచడానికి 99631 64111 హెల్ప్లైన్ నంబర్ సైతం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వివరించారు. తమిళనాడులో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అందిస్తున్న సేవలను ఎంజీఎం నేరుగా అందుబాటులోకి తీసుకొచ్చిందని అన్నారు. ఈ విభాగానికి సైతం అవసరమయ్యే అన్ని రకాల మందులను అందుబాటులో ఉండేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్, కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్దాస్, ఎంజీఎం ఆర్ఎంవో మురళి, డాక్టర్ ప్రసాద్, పలువురు విభాగాధిపతులు, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ రాష్ట్ర సలహాదారు ఈవీ శ్రీనివాస్, తెలంగాణ ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఓరుగంటి లైలా, కమ్యూనిటీ మొబిలైజర్ పూర్ణిమారెడ్డి పాల్గొన్నారు.
అవసరాన్ని బట్టి సేవలు విస్తరిస్తాం..
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడాలేని విధంగా ట్రాన్స్జెండర్స్కి ప్రత్యేక ఓపీ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మంగళవారానికి మాత్రమే పరిమితమైన సేవలను అవసరాన్ని బట్టి మరిన్ని రోజులకు పెంచడానికి చర్యలు చేపడతాం. ఈ విభాగంలో డెర్మటాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఎండోక్రైనాలజీ, ఎస్టీడీ, హెచ్ఐవీ విభాగాధిపతుల పర్యవేక్షణలో వైద్యసేవలు అందిస్తాం. జరుగుతుంది. రానున్న రోజుల్లో అవయవ మార్పులకు సంబంధించిన శస్త్రచికిత్సలను సైతం అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ చంద్రశేఖర్, ఎంజీఎం సూపరింటెండెంట్
వైద్యుల సహకారం మరువలేనిది..
అవయవ మార్పిడి మూలంగా చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. శస్త్రచికిత్స సమయంలో అందించిన వైద్య వివరాలు అందుబాటులో లేకపోవడంతో తిరిగి అక్కడికే వెళ్లి వైద్యసేవలు పొందాల్సి వచ్చేది. కానీ, మా కోసం ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేశారు. మా ఆరోగ్య రక్షణకు చర్యలు చేపడుతున్న వైద్యులు, అధికారులకు ట్రాన్స్జెండర్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
– ఓరుగంటి లైలా, తెలంగాణ ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు