కరీమాబాద్/కాశీబుగ్గ/నర్సంపేట/నెక్కొండ/దుగ్గొండి/నర్సంపేటరూరల్/పోచమ్మమైదాన్/గీసుగొండ, ఆగస్టు 2: జిల్లాలో నాగుల పంచమి వేడుకలను మంగళవారం మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలకు తరలివెళ్లి నాగేంద్రుడికి నైవేద్యంగా పాలు, అరటిపండ్లను సమర్పించారు. కరీమాబాద్ ఉర్సులోని శ్రీనాగేంద్రస్వామి ఆలయంలో కార్యనిర్వాహణాధికారి కమల ఆధ్వర్యంలో పూజారి శ్రీరాంశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొందరు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వల్లీదేవసేన సమేత సుబ్రమణ్యేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దూరప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి వచ్చారు. ఈవో కమల, మిల్స్కాలనీ పోలీసులు ఏర్పాట్లు చేశారు. బీరన్నస్వామి ఆలయంలో కార్పొరేటర్ మరుపల్ల రవి పూజలు చేశారు. కాశీబుగ్గ 19వ డివిజన్లోని శ్రీకనకదుర్గ ఆలయంలో నాగేంద్రస్వామికి మహిళలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పుట్టలో పాలు పోశారు. నర్సంపేటలోని నాగేంద్రస్వామి ఆలయాల్లో పూజలు చేశారు. స్వామివారికి పాలు, పండ్లు, కోడిగుడ్లు నైవేద్యంగా సమర్పించారు.
పుట్టపై పసుపు, కుంకుమ చల్లారు. అగరుబత్తులు, దీపాలు వెలిగించారు. నాగపడగలతో మొక్కలు చెల్లించుకున్నారు. కొంతమంది మహిళలు ఉపవాస దీక్ష చేపట్టారు. నెక్కొండలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో నాగేంద్ర, సుబ్రహ్మణ్యస్వామి మూలవిరాట్టుకు నాగపంచమిని పురస్కరించుకొని పంచామృతాభిషేకాలు నిర్వహించి విశేష పూజలు అందించారు. భక్తులు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే, నెక్కొండ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలోని పుట్ట వద్ద మహిళలు పాలు పోశారు. గుండ్రపల్లి, పెద్దకోర్పోలులో నాగేంద్రస్వామి ఆలయాలకు మహిళలు పోటెత్తారు. దుగ్గొండి మండలవ్యాప్తంగా భక్తులు నాగుల పంచమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నర్సంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. సర్వాపురం శివారు నర్సంపేట-మహబూబాబాద్ ప్రధాన రహదారి సమీపంలోని నాగేంద్రస్వామి ఆలయ ఆవరణలోని భక్తులు పుట్టలో పాలు పోశారు.
వరంగల్ కొత్తవాడ తోట మైదానంలో నాగుల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సల్లంగా చూడాలంటూ నాగేంద్రస్వామిని భక్తులు వేడుకున్నారు. కార్యక్రమంలో 23వ డివిజన్ మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ పాల్గొన్నారు. గీసుగొండ మండలంలోని ఊకల్ నాగేంద్రస్వామి ఆలయంలో అర్చకుడు సుదర్శనాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు న్విహించారు. భక్తులు నాగేంద్రస్వామి ఆలయంలోని పుట్టలో పాలు పోసి మొక్కలు చెల్లించుకున్నారు. ఎంపీపీ బీమగాని సౌజన్య, ఊకల్ ఎంపీటీసీ బేతినేని వీరరావు, సర్పంచ్ నాగమణి పాల్గొన్నారు.