వరంగల్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : రెండో విడుత సబ్సిడీ గొర్రెల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే గుర్తించిన లబ్ధిదారులకు 75 శాతం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేసేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం ప్రారంభించింది. గురువారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమానికి జిల్లా నుంచి ఓ పశు వైద్యురాలు హాజరయ్యారు. ఆమెతో జిల్లాలోని ఇతర పశు వైద్యులు, సిబ్బందికి శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు పశుసంవర్థకశాఖ అధికారులు నిర్ణయించారు. లబ్ధిదారుల నుంచి వాటాధనం జిల్లా కలెక్టర్ అకౌంట్లో జమ చేయడం, గొర్రెలను కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో పాటించాల్సిన నిబంధనలను పశు వైద్యులు, సిబ్బందికి తెలియజేయడం శిక్షణ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం.
ముఖ్యంగా రెండు వారాల్లోపు లబ్ధిదారుల వాటాధనాన్ని కలెక్టర్ అకౌంట్లో జమ చేయడంపై పశు సంవర్ధక శాఖ అధికారులు దృష్టి సారించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కులవృత్తులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గొర్రెల పెంపకందారులు, మత్స్యకారులు, చేనేత, గీత తదితర వృత్తిపని వారి కోసం సబ్సిడీ పథకాలను అమల్లోకి తెచ్చింది. వీటిలో గొర్రెల పంపిణీ ఒకటి. గొర్రెల పెంపకందారుల్లో ప్రతి ఒకరికి 21 గొర్రెలతో కూడిన యూనిట్ను 75 శాతం సబ్సిడీతో అందజేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ పథకాన్ని రూపొందించారు. ఒక ఇంట్లో ఒకరికే అనేది లేకుండా గొర్రెల పెంపకందారులు ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పథకం ద్వారా రెండు విడుతల్లో సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ మేరకు ప్రతి లబ్ధిదారుకు అందే 21 గొర్రెల యూనిట్లో 20 ఆడ గొర్రెలు, ఒక పొట్టేలు ఉండేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ గొర్రెల పథకాన్ని 2017-18లో ఆచరణలోకి తెచ్చింది. మొదట అధికారులు గొర్రెల పెంపకందారుల సంఘాలతో సమావేశమై ఆయా గ్రామాల్లో ఉన్న గొర్రెల పెంపకందారులను గుర్తించారు. వీరిని ఏ, బీ గ్రూపులుగా చేసి జాబితాలను రూపొందించారు. ‘ఏ’ గ్రూపు జాబితాలో చోటు లభించిన పెంపకందారులకు తొలివిడుత 75 శాతం సబ్సిడీపై గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. అప్పట్లో 21 గొర్రెల యూనిట్ విలువ రూ.1.25 లక్షలు. ఇందులో ఒక్కో లబ్ధిదారు 25 శాతం అంటే రూ.31,250 చొప్పున తన వాటాధనం డీడీ రూపంలో చెల్లించారు.
75 శాతం సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వం రూ.93,750 ఇచ్చింది. లబ్ధిదారులు, పశు సంవర్ధకశాఖ అధికారులు, వైద్యులు ప్రభుత్వం నిర్ణయించిన ఇతర రాష్ర్టాలకు వెళ్లి గొర్రెలను కొన్నారు. వాటిని లారీల ద్వారా జిల్లాకు తీసుకొచ్చారు. యూనిట్ కాస్ట్లో నుంచే ట్రాన్స్పోర్ట్ చార్జీలు, ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లించారు. ఈ సబ్సిడీ గొర్రెల పంపిణీతో లబ్ధిదారులు మురిసిపోయారు. అప్పటివరకు పాలేరు జీవితం గడిపిన లబ్ధిదారులు కొం దరు ఈ పథకం అమలుతో గొర్రెలకు యజమానులుగా మారారు. సబ్సిడీ గొర్రెల పంపిణీతో ఊరూ రా గొర్రెల సంపద పెరిగింది. లబ్ధిదారులు సబ్సిడీ గొర్రెల పెంపకంతో ఉపాధి పొందుతున్నారు.
యూనిట్ విలువ పెంపు
కరోనా మహమ్మారితో గొర్రెల ధరలు పెరుగడంతో రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపకందారులకు రెండో విడుత పంపిణీ చేసే సబ్సిడీ గొర్రెల యూనిట్ విలువను కొద్ది నెలల క్రితం పెంచింది. 21 గొర్రెల యూనిట్ విలువను రూ.1.75 లక్షలకు ఎగబాకింది. ఇందులో ప్రతి లబ్ధిదారు తన వాటాధనం 25 శాతం కింద రూ.43,750 చెల్లించాల్సి ఉంది. దీనికి ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ రూ.1,31,250 ఇవ్వనుంది. ‘బీ’ గ్రూపులోని లబ్ధిదారులందరికీ రెండో విడుత సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేయాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొద్దిరోజుల క్రితం రాష్ట్ర పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తమ శాఖ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘బీ’ గ్రూపులోని గొర్రెల పెంపకందారుల నుంచి రెండు వారాల్లోగా వాటాధనాన్ని కలెక్టర్ల అకౌంట్లలో జమ చేయడం పూర్తి చేయాలని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలతో పశుసంవర్థక శాఖలో రెండో విడుత సబ్సిడీ గొర్రెల పంపిణీపై శిక్షణ కార్యక్రమం మొదలైంది.
గురువారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి పశు వైద్యుల శిక్షణ కార్యక్రమానికి జిల్లాలోని ఎనుమాముల లక్ష్మీపురం పశు వైద్యురాలు భగీరథి హాజరయ్యారు. శనివారం జిల్లాలో గొర్రెల పంపిణీపై శిక్షణ కార్యక్రమం జరుగనుంది. హైదరాబాద్ శిక్షణకు హాజరైన పశు వైద్యురాలు ఆ కార్యక్రమంలో లబ్ధిదారుల వాటాధనాన్ని కలెక్టర్ అకౌంట్లో జమ చేయడంపై వివరిస్తారు. జిల్లాలోని పశు వైద్యులు, సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారని పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ బాలకృష్ణ వెల్లడించారు.
తొలివిడుత లబ్ధిదారులు తమ వాటాధనం డబ్బు డీడీ రూపంలో చెల్లించారని, ఈసారి లబ్ధిదారుల బ్యాంకు ఖాతా నుంచి ఈ-లాబ్ ద్వారా జిల్లా కలెక్టర్ అకౌంట్లో జమ చేయడం జరుగనుందని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ప్రభుత్వం నిర్ణయించిన ఇతర రాష్ర్టాలకు వెళ్లి గొర్రెలను కొనుగోలు చేయడం ప్రారంభం కానుందని, గొర్రెల కొనుగోలు కోసం లబ్ధిదారులు, పశు సంవర్ధక శాఖ అధికారులు, వైద్యులు వెళ్తారని బాలకృష్ణ చెప్పారు. జిల్లాలో ‘బీ’ గ్రూపులో 12,782 మంది గొర్రెల పెంపకందారులు ఉన్నారని, వీరందరికీ రెండో విడుత సబ్సిడీ గొర్రెల పంపిణీ జరుగనుందని ఆయన తెలిపారు. తొలివిడత సబ్సిడీ గొర్రెల యూనిట్లు పొందకుండా జిల్లాలో మిగిలిపోయిన ‘ఏ’ గ్రూపులోని 98 మందికి కూడా రెండో విడుత సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేసే అవకాశం ఉందని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి వెల్లడించారు.