వర్ధన్నపేట, జూలై 28: ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను రైతులు వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాళ్ సూచించారు. మండలంలోని దమ్మన్నపేట రైతు వేదికలో సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ జియో స్పేసింగ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (సీఈజీఐఎస్) సంస్థ ఆధ్వర్యంలో ప్రతినిధులు స్టీఫెన్, శ్రీనివాస్తో కలిసి రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణ వ్యవసాయ శాఖ సీఈజీఐఎస్తో కలిసి ఉమ్మడిగా రైతు సంక్షేమం కోసం పని చేయనుందన్నారు. రైతులకు సబ్సిడీపై అధునాతన పరికరాలను ఈ సంస్థ ద్వారా అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే దమ్మన్నపేట గ్రామంలో రైతుల అభిప్రాయాలను సమగ్రంగా తెలుసుకోవడంతోపాటు ఏఈవోల పనితీరు, రైతు వేదికను ఉపయోగించుకుంటున్న తీరును వారు పరిశీలించారు.
అనంతరం రైతులకు సంబంధించిన సమస్యలను తెలుసుకొని సమగ్రంగా రైతు సమస్యలపై ప్రత్యేక నివేదికను తయారు చేస్తామని జేడీఏ వెల్లడించారు. ఈ నివేదిక ఆధారంగా గ్రామాల్లోని రైతులకు కావాల్సిన పరికరాలు, యంత్రాలు, ఇతర అవసరాలను సమకూర్చనున్నట్లు వివరించారు. అలాగే, రైతులు గుడ్డిగా పురాతన పద్ధతులు అవలంబించి ఇబ్బందులకు గురికాకుండా నిపుణుల సూచనల మేరకు పంటలు సాగు చేయాలని సూచించారు. పంటలపై విచ్చలవిడిగా రసాయనిక ఎరువులను వాడి ఆర్థికంగా నష్టపోకుండా అదనుకు తగినట్లు తెగుళ్లను గుర్తించి మాత్రమే మందులను వాడాలని కోరారు. సదస్సులో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఏఎంసీ చైర్మన్ కమ్మగోని స్వామిరాయుడు, ఏడీఏ సురేశ్కుమార్, ఏవో రాంనర్సయ్య, సర్పంచ్లు అర్జుల మంగ, మంద సతీశ్, ఏఈవోలు, వెంకట్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
వ్యవసాయాధికారులతో ముఖాముఖి
సంగెం: పంటల వైవిద్దీకరణ మిషన్పై వ్యవసాయాధికారులతో ప్రజాప్రతినిధుల ముఖాముఖి కార్యక్రమం తీగరాజుపల్లి రైతువేదికలో జరిగింది. సీఈజీఐఎస్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జేడీఏ ఉషాదయాళ్ పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు అనుసరిస్తున్న పంటలు, సాగు విధానాలు బాగున్నాయని తెలిపారు. రైతులకు ప్రభుత్వం ద్వారా వ్యవసాయ శాఖ సేవలు అందిస్తుందన్నారు. పచ్చిరొట్ట సాగు విధానం, జీవ ఎరువుల వాడకం, డ్రమ్సీడర్ పద్ధతిపై ప్రజాప్రతినిధులు, వ్యవసాయాధికారులు చర్చించారు. కార్యక్రమంలో ఏవో సీహెచ్ యాకయ్య, సీఈజీఐఎస్ ప్రతినిధి స్టీవెన్ బ్రౌన్స్టన్, సారంగం, సర్పంచ్లు కర్జుగుత్త రమ, బోంపల్లి జయశ్రీ, ఎంపీటీసీలు రంగరాజు నర్సింహస్వామి, రజిత, కోఆర్డినేటర్ చిరంజీవి, మాజీ ఎంపీపీ వీరాచారి పాల్గొన్నారు.