వెంకటాపూర్, జూలై 28 : రామప్ప ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. మండలంలోని పాలంపేట గ్రామంలో ఉన్న ఆలయాన్ని కలెక్టర్ కృష్ణఆదిత్య, కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్ స్మిత ఎస్ కుమారి, ఎమ్మెల్యే సీతక్కతో కలిసి గురువారం ఆయన సందర్శించారు. అంతకు ముందు ఆయనకు స్మిత ఎస్ కుమారి, కృష్ణ అదిత్య పుష్పగుచ్ఛం అందజే సి స్వాగతం పలికారు. ఆలయ పూజారులు హరీశ్శర్మ, ఉమాశంకర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. రామప్ప విశిష్టత, కట్టడంలోని ప్రత్యేకతను ప్రొఫెసర్ పాండు రంగారావు, టూరిజం గైడ్ ద్వారా తెలుసుకున్నారు. ఆలయ గోపురానికి వాడిన ఇటుకను నీళ్లలో వేసి పరీక్షించారు.
ఇటుక నీటిపై తేలడాన్ని గుర్తించిన ఆయన అప్పట్లో ఇటుకలను ఏ మెటీరియల్ వాడి తయారు చేసి ఉంటారని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. కామేశ్వరాలయ పునరుద్ధరణకు పురావస్తు శాఖ అధికారులు తయారు చేసిన ప్రణాళికను సూపరింటెండెంట్ వివరించారు. అదేవిధంగా చెరువు వద్ద ఉన్న ఉప ఆలయాలు, రామప్ప ఆలయానికి పడమర వైపు ఉన్న 8 ఉప ఆలయాల డీపీఆర్, రామప్ప చెరువు సుందరీకరణకు తీసుకుంటున్న చర్యలు, నిధుల గురించి కలెక్టర్ కృష్ణఅదిత్య, ఇరిగేషన్ అధికారులు వివరించారు. అనంతరం గ్రామంలో పర్యాటక శాఖకు కేటాయించిన 27 ఎకరాల స్థలాన్ని పరిశీలించిన ఆయన ఆలయానికి యునెస్కో గుర్తింపు ఇవ్వడానికి కారణమైన ఎనిమిది ముఖ్య అంశాలపై చర్చించారు. అందులో ప్రధాన అంశమైన ఆలయానికి హద్దులతో పాటు బఫర్జోన్ నిర్ణయించాలని సూచించారు.
ఇందుకోసం పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి సిబ్బందిని కేటాయించాలన్నారు. అనంతరం ఆలయం ఎదుట సెర్ప్ సహకారంతో స్థానిక మహిళలు ఏర్పాటుచేసిన రామప్ప టై అండ్ డై చీరల షాపును ప్రారంభించారు. ఎమ్మెల్యే సీతక్క మొదటి చీర కొని స్మిత ఎస్ కుమారికి బహూకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్రావు, ఎంపీపీ బుర్ర రజితాసమ్మయ్య, టూరిజం ఈఈ సాంబయ్య, డీటీవో శివాజీ, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, అర్కిటెక్ట్ సూర్యనారాయణ మూ ర్తి, రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ నారాయణ, ఏడీ మల్లనాయక్, కేంద్ర పురావస్తు శాఖ ఏఈ కృష్ణ చైతన్య, సీఏ మల్లేశ్, డీపీవో వెంకయ్య, ఇరిగేషన్ సీఈ విజయ భాస్కర్, ఎస్ఈ వెంకటేశ్వర్రావు, ఈఈ వెంకటకృష్ణరావు, డీఈ రవీందర్, డీఆర్డీవో నాగపద్మజ, తహసీల్దార్ మంజుల, ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్సై రాధి క, సర్పంచ్ డోలి రజితాశ్రీనివాస్, దేవాదాయ శాఖ ఏసీ సునీత, ఇన్స్పెక్టర్ అనిల్కుమార్, ఈవో శ్రీనివాస్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ములుగు కలెక్టరేట్లో సమీక్ష
ములుగుటౌన్ : రామప్ప ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. వెంకటాపూర్లో ఆలయాన్ని సందర్శించిన అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యునెసో విధించిన ఎనిమిది అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ఆధ్వర్యంలో కంబోడియా, థాయిలాండ్, ఇండోనేషియాలో పర్యటించి రామప్ప ఆలయంతో పోలిన ఆలయాలను గుర్తించి నివేదిక అందజేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ కన్జర్వేషన్ మేనేజ్మెంట్ ప్లాన్ (ఐసీఎంపీ) తయారు చేసేందుకు రుద్రేశ్వర ఆలయానికి ప్రాంతీయ పర్యాటక అభివృద్ధి ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అనాస్టిలోసిస్ సూత్రం ఆధారంగా కామేశ్వర ఆలయాన్ని పునర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో అంకిత్, అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠి, వైవీ గణేశ్, ఎమ్మెల్యే సీతక్క, ఆరియాలజీ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్, పాలంపేట స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ సభ్యులు, కాకతీయ హెరిటేజ్ సభ్యులు పాండురంగారావు, మూర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.