వరంగల్, జూలై 28: మురికివాడల్లో నివసిస్తున్న పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానల పనులు వేగంగా సాగుతున్నాయి. ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు పనుల్లో వేగం పెంచారు. అర్బన్ హెల్త్ సెంటర్లకు అనుబంధంగా పని చేసేలా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు గ్రేటర్కు ఐదు బస్తీ దవాఖానలను మంజూరు చేశారు. హనుమకొండ జిల్లా పరిధిలో రెండు, వరంగల్ జిల్లాలో మూడు బస్తీ దవాఖానాలు మంజూరయ్యాయి. హనుమకొండలో పూరిగుట్ట, జులైవాడ, వరంగల్లోని గిరిప్రసాద్నగర్, బీఆర్నగర్ (రాజీవ్ గృహకల్ప సముదాయం, క్రిస్టియన్కాలనీలో బస్తీ దవాఖానల ఏర్పాటుకు గ్రేటర్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భవనాలు, మౌలిక వసతులు కల్పించి జిల్లా వైద్య శాఖకు అప్పగిస్తే డాక్టర్తోపాటు సిబ్బందిని నియమించి బస్తీ దవాఖానలను నిర్వహించనున్నారు. మరో 15 రోజుల్లో బస్తీ దవాఖానల పనులు పూర్తికానున్నాయి. జులైవాడ మినహా మిగిలిన నాలుగు బస్తీ దవాఖానల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
సాయంత్రం 4 గంటల వరకు సేవలు..
బస్తీ దవాఖానలో డాక్టర్ కోసం ప్రత్యేకంగా గది, రోగులు కూర్చునేందుకు కుర్చీలు, మందులు ఇచ్చేందుకు గది ఏర్పాటు చేస్తున్నారు. జులైవాడ కమ్యూనిటీహాల్లో బస్తీ దవాఖన ఏర్పాటుకు స్థానికులు అభ్యంతరం చెప్పడంతో పనులు ఆలస్యం అవుతున్నాయని అధికారులు అంటున్నారు. కలెక్టర్ల నేతృత్వంలో బస్తీ దవాఖా నల్లో సిబ్బందిని నియమిస్తారని వైద్యాధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్తీ దవాఖానలు పనిచేస్తాయని పేర్కొన్నారు. రోగులకు మందులతోపాటు పరీక్షలు చేస్తామని వైద్యాధికారులు వివరించారు.