గిర్మాజీపేట, జూలై 16: జిల్లాలోని పలు పీహెచ్సీలు, సబ్సెంటర్లు కాయకల్ప అవార్డులు అందుకున్నాయి. ఈ మేరకు వైద్య సిబ్బందికి డీఎంహెచ్వో డాక్టర్ కాజీపేట వెంకటరమణ శనివారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. కాయకల్ప అవార్డుకు ఎంపికైన వాటి వివరాలను ఆయన కలెక్టర్ గోపికి తెలియజేసి సంతోషాన్ని పంచుకున్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల విభాగంలో ఖానాపురం పీహెచ్సీకి కాయకల్ప అవార్డు వచ్చింది. ఫెర్ఫార్మెన్స్ అవార్డులను నల్లబెల్లి, నెక్కొండ, మేడిపల్లి పీహెచ్సీలు అందుకున్నాయని డీఎంహెచ్వో తెలిపారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల విభాగంలో ఉత్తమ సేవలు అందించిన పీహెచ్సీగా దేశాయిపేట నిలిచిందని, ఫెర్ఫార్మెన్స్ విభాగంలో కీర్తినగర్, చింతల్ పట్టణ ఆరోగ్య కేంద్రాలకు అవార్డులు వచ్చాయని వివరించారు. అలాగే, సబ్సెంటర్ల విభాగంలో ధర్మారం, రుద్రగూడెం, కాపులకనపర్తికి కాయకల్ప అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ అవార్డుల ద్వారా వచ్చిన నగదులో 20 శాతం ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి కేటాయిస్తామని, 80 శాతం నగదును దవాఖాన అభివృద్ధి కార్యకలాపాలకు వినియోగిస్తారని వెల్లడించారు. ఈ అవార్డు పొందిన వారికి వృత్తిపరంగా గుర్తింపుతోపాటు మానసిక వికాసం, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని డీఎంహెచ్వో తెలిపారు. వైద్య సిబ్బంది ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించడంలో ముందువరుసలో ఉండి కాయకల్ప అవార్డులతోపాటు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందాలని ఆయన ఆకాంక్షించారు.