వర్ధన్నపేట, జూన్ 26 : రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చే నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు. మండలంలోని ఇల్లంద గ్రామంలోని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం జరిగిన నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రితో పాటు ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు హాజరయ్యారు. తొలుత కమిటీ చైర్మన్ కమ్మగోని స్వామిరాయుడు, వైస్చైర్మన్ నర్సింహాచార్యులు, సభ్యులుగా బొచ్చు జ్యోతి, గుండ్ల సుభాష్, కుందూరు యాదగిరిరెడ్డి, దొమ్మాటి సుభాష్, తక్కళ్లపల్లి రవీందర్రావు, తోట సుదర్శన్, ఎనగందుల మురళి, గుగులోత్ వెంకన్న, గుండె రామస్వామి, ఎండీ ఉస్మాన్, వల్లపు వెంకటేశ్వర్లు, అనుముల నర్సయ్యతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్లుగా పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, సర్పంచ్ సుంకరి సాంబయ్య ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ల వయసును 57 ఏళ్లకు తగ్గించిందని, ఈ మేరకు అర్హులైన వారికి వచ్చే నెల నుంచి పెన్షన్లు మంజూరు చేయనున్నదని తెలిపారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నా సీఎం కేసీఆర్ ఏమాత్రం వెనుకంజ వేయకుండా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారన్నారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ప్రతి చెరువునూ గోదావరి జలాలతో నింపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. రైతులకు సేవలందించిన సీఎంలు ఇద్దరనేనని, ఒకరు ఎన్టీఆర్ అయితే మరొకరు ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు. ఎన్టీఆర్ పట్వారీ వ్యవస్థను సమూలంగా తీసివేసి రైతులకు అండగా నిలిచారన్నారు. కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా సౌకర్యాన్ని కల్పించి రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చారన్నారు. ఇల్లంద వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీనిచ్చారు. అనంతరం నూతన కమిటీ పాలకవర్గాన్ని అభినందించారు. అలాగే, కమిటీ సభ్యులు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్, డీసీసీబీ చైర్మన్కు మెమెంటోలు అందజేసి సన్మానించారు.
నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యమివ్వాలి.. ఎమ్మెల్యే అరూరి రమేశ్
వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యమివ్వాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరారు. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి ముఖ్యనాయకులు, కార్యకర్తలు భాగస్వాములయ్యారన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను పార్టీ తప్పకుండా కాపాడుతుందన్నా రు. ఇప్పటికే పలువురికి నామినేటెడ్ పదవులు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు అన్నమనేని అప్పారవు, అనిమిరెడ్డి, జడ్పీటీసీలు మార్గం భిక్షపతి, రంగు కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు, ఆత్మ చైర్మన్ గుజ్జ గోపాల్రావు పాల్గొన్నారు.