వరంగల్, జూన్ 26: మానవ మనుగడకు పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ నియంత్రణపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. జూలై 1 నుంచి 75 మైక్రాన్ల మందంలోపు ప్లాస్టిక్ను నిషేధించింది. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బబందీగా అమలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కాగా అమలు చేసే దిశగా అధికారులు కార్యాచరణ రూపొందించారు. గ్రేటర్, పోలీస్, కాలుష్య నియంత్రణ మండలి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేసింది. గ్రేటర్ పరిధిలో ఉన్న ప్లాస్టిక్ హోల్సేల్ వ్యాపారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు.
నింబంధనలు ఉల్లంఘించి నిషేధిత పాస్టిక్ను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనికి తోడు జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించారు. ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలు, చిరు వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పాఠశాలలో కరపత్రాలు పంపిణీ చేయనున్నారు. ర్యాలీలు నిర్వహించాలని, నగర హోర్డింగ్లు, లాలిపాప్ల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై జూలై 1 నుంచి గ్రేటర్ యుద్ధం ప్రకటించింది.
ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో నిఘా..
గ్రేటర్ పరిధిలో నిషేధిత ప్లాస్టిక్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేశారు.వారికి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఏర్పాటు చేయనున్నారు. నిషేధిత ప్లాస్టిక్ను విక్రయించినా, వినియోగించినా పెద్ద ఎత్తున జరిమానా విధించనున్నారు. రూ.500 నుంచి రూ.5 వేల వరకు జరిమానాతోపాటు షాపుల ట్రేడ్ లైసెన్స్లను రద్దు చేయనున్నారు. ఎన్ఫోర్స్మెంట్ బృందాల్లో గ్రేటర్ నుంచి హెల్త్ ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్తోపాటు ఇద్దరు పోలీసులు, కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఒకరు, స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరిని సభ్యులుగా నియమించారు.
వందకు పైగా హోల్సేల్ దుకాణాలు
గ్రేటర్ పరిధిలో ప్లాస్టిక్ హోల్సేల్ దుకాణాలు వందకు పైగా ఉన్నాయి. ఇప్పటికే హోల్ సేల్ వ్యాపారులకు గేటర్ నోటీసులు జారీ చేసింది. జూలై 1 నుంచి ప్రభుత్వ నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. బల్దియా అధికారులు సైతం హోల్సేల్ వ్యాపారాలపై గట్టి నిఘా పెట్టనున్నారు. దీంతో పాటు నగరంలోని ట్రాన్స్పోర్ట్లపై దృష్టి సారించనున్నారు. బయటి ప్రాంతాల నుంచి నిషేధిత ప్లాస్టిక్ నగరానికి రవాణా కాకుండా గటి నిఘా పెట్టనున్నారు.
విస్తృత ప్రచారం..
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు నగరంలో విస్తృత ప్రచారానికి గ్రేటర్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న హోర్డింగ్లతోపాటు సెంట్రల్ మీడియాల్లో లాలిపాప్స్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ఇంటికి కరపత్రాలు పంపిణీ చేయనున్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన కల్పించనున్నారు.
గ్రేటర్లో ప్లాస్టిక్ నియంత్రణ సెల్
గ్రేటర్లో ప్లాస్టిక్ నియంత్రణ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. నగరంలో నిషేధిత ప్లాస్టిక్ వినియోగం, విక్రయాలపై సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తాం. నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగంపై జూలై 1 నుంచి గట్టి నిఘా పెడుతాం. ప్రతి రోజూ ఎన్స్ఫోర్స్మెంట్ బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించినా, విక్రయించినా ట్రేడ్ లైసెన్స్ రద్దుతోపాటు జరిమానా విధిస్తాం. ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వినియోగించకుండా ప్రజల్లో చైతన్యం తెస్తాం.
– డాక్టర్ రాజారెడ్డి, చీఫ్ ఎంహెచ్వో