-కేసముద్రం, జూన్ 19: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యానవన శాఖ అధికారుల సూచనలతో సంప్రదాయ పద్ధతికి స్వస్తి పలుకుతూ లాభాలనిచ్చే, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో జిల్లాలో ప్రతి ఏటా కూరగాయల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. గతేడాది జిల్లాలో 620 ఎకరాల్లో రైతులు కూరగాయలు సాగు చేయగా, ఈ ఏడాది 975 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
ఉద్యాన పంటలకు ప్రాధాన్యత
ఉద్యాన పంటల సాగు విషయంలో రైతులకు రోజురోజుకూ ఆసక్తి పెరుగుతున్నది. గతేడాది కం టే ఈ ఏడాది కూరగాయలు, పండ్ల తోటల సాగు విస్తీర్ణం పెరిగింది. రైతులు సాధారణంగా వరి, మక్కజొన్న, పత్తి, పసుపు, పెసర, కంది వంటి పంటలను సాగు చేస్తుంటారు. అయితే వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసి భూగర్భ జలాలు పెరుగడం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులకు నీరు చేరడంతో బావులు, బోర్లలో నీరు సమృద్ధిగా లభిస్తున్నది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏరాష్ట్రం ఇవ్వని విధంగా ఎకరానికి రూ.10వేల పెట్టుబడి సహాయం అందించడంతో రైతులు పండుగలా వ్యవసాయం చేస్తున్నారు. పెట్టుబడి సాయం అందడంతో మూసపద్ధతికి స్వస్తి పలికి ప్రయోగాత్మకంగా పంటలను సాగు చేస్తున్నారు. కొందరు రైతులు ఏడాదికి మూడు పంటలను సైతం పండిస్తున్నారు. వంకాయ, బెండకాయ, బీరకాయ, కాకరకాయ, బుడంకాయ, టమాట, దోసకాయ, సోరకాయ, పుచ్చకాయ, కీరదోస వంటి పంటలను పండిస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. వేసవిలోనూ కూరగాయలు పండిస్తుండడంతో ఇటు కూలీలకు ఉపాధి దొరుకుతున్నది. పంట ఉత్పత్తులను ఆటోల్లో వరంగల్ మార్కెట్, హోటళ్లు, రెస్టారెంట్లకు తరలిస్తున్నారు. ప్రతిగ్రామంలో పదుల సంఖ్యలో రైతులు కూరగాయలను పండిస్తున్నారు. కాలానికి అనుగుణంగా పండే పంటలను గుర్తించి వాటిని సాగు చేస్తూ నూతన యాజమాన్య పద్ధతులు పాటించడంతో అధిక దిగుబడులు, ఆదాయం పొందవచ్చని జిల్లాలోని రైతులు నిరూపిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి నారు తీసుకొచ్చాం..
హైదరాబాద్లోని నర్సరీ నుంచి రూ.80 పైసలకు ఒక మొక్క చొప్పున ఎకరానికి సరిపడా 4వేల మొక్కలను తీసుకొచ్చాం. నారుతో దుక్కి చేయడం, ఎరువులు, మందులు, కూలీలు, ట్రాలీ కిరాయి కలిపి ఇప్పటి వరకు రూ.25 వేల ఖర్చు వచ్చింది. 70 క్వింటాళ్ల వంకాయ దిగుబడి రాగా, కిలో రూ.10 చొప్పున 70 వేలు వచ్చినయ్. మరో 2 నెలలపాటు వంకాయలు కాసే అవకాశముంది. సంప్రదాయ పంటల కంటే కూరగాయలు సాగు చేస్తే మేలు కలుగుతున్నది.
-సంకపల్లి యాకూబ్రెడ్డి, రైతు, కల్వల
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం.. దిగుబడి
ఎనిమిదేళ్లుగా భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. పత్తి, పసుపు, మిర్చి వంటి పంటలను సాగు చేసి నష్టపోయాను. పెట్టుబడి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. దీంతో మూడేళ్లుగా కూరగాయలు పండిస్తున్నాను. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో బీరకాయ, వంకాయ, టమాట, వంటి పంటలను సాగు చేసి, వరంగల్ మార్కెట్కు తరలిస్తున్నాను. ఈ ఏడాది 2 ఎకరాల్లో వంకాయ సాగు చేయగా ఇప్పటి వరకు రూ.90వేలు వచ్చినయ్.
-బావ్సింగ్, కోమటిపల్లి రైతు
కూరగాయల సాగును పెంచాలి
ఇతర జిల్లాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నందున రైతులు కూరగాయల సాగుపై దృష్టి సారించాలి. ముఖ్యంగా ప్రతిరైతు తనకున్న భూమిలో ఒకటి, రెండు పంటలే కాకుండా అన్ని రకాల పంటలను సాగు చేస్తే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. మూస పద్ధతిని వీడి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి. అయిల్పామ్ సాగు చేసే రైతులు అంతర్పంటగా కూరగాయలు సాగు చేయవచ్చు. వీటితోపాటు పండ్లు, పూల తోటలతో లాభాలు ఆర్జించాలి.
-సూర్యనారాయణ,ఉధ్యానవనశాఖ అధికారి