సంగెం, జూన్ 19: గతంలో యోగా సాధన పట్టణాలు, నగరాలకే పరిమితం కాగా.. నేడు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించింది. రోజురోజుకు పెరుగుతున్న మానసిక ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యంగా ఉండేందుకు గ్రామీణ ప్రాంత ప్రజలు యోగా సాధన చేస్తున్నారు. మొండ్రాయి, పల్లార్గూడ, ముమ్మిడివరం, నార్లవాయి, నల్లబెల్లి, కొత్తపల్లిలో యోగా సాధన కేంద్రాలు వెలిశాయి. అన్ని వర్గాల వారు ఈ కేంద్రాలకు వెళ్లి యోగాసనాలు వేస్తున్నారు. యోగా సాధన శిబిరంలో యోగాసనాలతోపాటు ఆనందంగా ఎలా జీవించాలో నేర్పిస్తారు. ఉరుకులు పరుగుల జీవితంలో నిత్యం మానసిక ఆందోళనలతో ఉండే వారు ప్రశాంతంగా జీవించేలా పాఠాలు చెబుతారు. మనస్సు ప్రశాంతతకు దోహదపడే విధానాన్ని నేర్పిస్తారు. వీటితోపాటు ద్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఎలా లభిస్తుందో సాధన ద్వారా తెలియజేస్తారు. ద్యానం, ప్రాణయామంతో మానసిక స్థితి ప్రశాంతంగా మారుతుంది. సమాజంలో ఎలా జీవించాలో తెలుస్తుంది. ఆరోగ్యం, ఆనందంగా ఉండేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. విద్యార్థులు సైతం ఒత్తిడిని జయించేందుకు యోగాసనాలు వేస్తున్నారు. ముఖ్యంగా మానసిక, శారీరక సమస్యలు ఉన్నవారు యోగా చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. 21 రోజుల సాధన పూర్తి చేసిన అనంతరం వారు ఇతరులకు నేర్పిస్తున్నారు. దీంతో అన్ని గ్రామాలకు యోగా విస్తరిస్తున్నది.