వరంగల్, జూన్ 9: మానసికోల్లాసం, శారీరక దృఢత్వం కోసం ప్రతి డివిజన్లో మూడు పార్కులను ఏర్పాటు చేసేందుకు గ్రేటర్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో నిర్దేంచిన లక్ష్యాల్లో క్రీడాప్రాంగణాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.15 రోజుల పాటు నిర్వహించనున్న పట్టణ ప్రగతిలో తెలంగాణ క్రీడాప్రాంగణాలు, వైకుంఠధామాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని మేయర్లు, కమిషనర్లను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు గ్రేటర్ పరిధిలో డివిజన్కు మూడు చొప్పున 198 పార్కులను ఏర్పాటు చేసే దిశలో అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే 22 తెలంగాణ క్రీడా ప్రాంగణాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పలు డివిజన్లలో ప్రారంభించారు. ప్రతి డివిజన్లో ఖాళీ స్థలాలను గుర్తించి పార్కులకు కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు.
గ్రామీణ క్రీడలకు పునర్జీవం
గ్రామీణ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పునర్జీవం పోసేలా క్రీడా ప్రాంగణాల్లో వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించింది. పార్కుల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ కోర్టులతో పాటు వ్యాయామం చేసుకునేలా జిమ్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో ఏర్పాటు చేసిన 22 తెలంగాణ క్రీడాప్రాంగణాల్లో ఆటలకు సంబంధించిన కోర్టులను ఏర్పాటు చేశారు. శారీరక దృఢత్వంతోపాటు మానసికోల్లాసం కోసం ప్రతి పార్కులో గ్రీనరీతో పాటు సందర్శకుల కోసం బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పార్కుకు ప్రహరీ నిర్మించనున్నారు. ఇందులో భాగంగానే మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య పట్టణ ప్రగతి పూర్తయ్యే నాటికి 22 తెలంగాణ క్రీడా ప్రాంగణాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఖాళీ స్థలాల గుర్తింపులో అధికారులు
గ్రేటర్లో పార్కుల ఏర్పాటు కోసం ఖాళీ స్థలాల గుర్తింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. ప్రతి డివిజన్లో మూడు పార్కుల చొప్పున స్థలాలను గుర్తిస్తున్నారు. కమిషనర్ ప్రావీణ్య టౌన్ప్లానింగ్ అధికారులకు స్థలాల గుర్తింపుపై ఆదేశాలు జారీ చేశారు. దీనిపై వారం రోజులుగా టౌన్ప్లానింగ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పార్కుల స్థలాలు గుర్తించిన వెంటనే అభివృద్ధి పనులు చేపట్టేలా ఇంజినీరింగ్ అధికారులు కార్యాచరణ రూపొందించారు. గ్రేటర్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న పార్కుల్లో అన్ని వసతులు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.