రాయపర్తి, మే 3: నెల రోజులపాటు కఠోర ఉపవాసాలు, ఖురాన్ శ్లోకాలను ఆలపిస్తూ ప్రత్యేక తరావీ నమాజులు చేసిన జిల్లాలోని ముస్లింలు మంగళవారం ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను అత్యంత భక్తి ప్రపత్తుల నడుమ జరుపుకున్నారు. సోమవారం సాయంత్రం ఆకాశంలో చంద్రవంక దర్శనం ఇవ్వడంతో రంజాన్ పర్వదిన వేడుకలకు సన్నద్ధమైన ముస్లింలు.. మంగళవారం తెల్లవారుజామున 5.15 గంటలకు ఫజర్ నమాజ్తో ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను ప్రారంభించుకున్నారు. జిల్లాలోని ముస్లిం కుటుంబాలన్నీ వేకువజామునే నిద్ర లేచి ఇళ్లు, వాకిళ్లను శుభ్రం చేసుకుని తలంటు స్నానాలు చేసి నూతన దుస్తులు ధరించి పాలు, సేమియా, డ్రైఫూట్స్లతో ప్రత్యేక సేమియా వంటకాలను తయారు చేసుకొని బంధుమిత్రులకు పంచుతూ వేడుకలు చేసుకున్నారు. అనంతరం గ్రామాలు, పట్టణాల్లోని ఈద్గాలకు ముస్లింలు వెళ్లి మత గురువులు చేసిన ఖుద్భా ప్రసంగాలను ఆలకిస్తూ ప్రత్యేక నమాజులు ఆచరించారు. అనంతరం గ్రామాల్లో ఖబ్రస్థాన్లకు చేరుకుని గతించిపోయిన తమ పూర్వీకుల సమాధులపై పూలు చల్లి నివాళులర్పించారు. భగవననామస్మరణ చేస్తూ ఇండ్లకు చేరుకుని వేడుకలు జరుపుకున్నారు. రంజాన్ పర్వదిన వేడుకల నేపథ్యంలో గ్రామాలు అత్తరు, సుర్మా వాసనలతో గుప్పుమంటూ ఈద్ ముబారక్ నినాదాలతో మార్మోగాయి.
ఇందులో భాగంగా రాయపర్తితోపాటు కాట్రపల్లి, పెర్కవేడు, కొండూరు, కొండాపురం, మహబూబ్నగర్, బందన్పల్లి, కొత్తూరు, ఊకల్, మైలారం, జగన్నాథపల్లి, వెంకటేశ్వరపల్లి, గన్నారం, తిర్మలాయపల్లిలో రంజాన్ పర్వదిన వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమాల్లో మసీద్ కమిటీల సదర్సాహెబ్లు లాయఖ్ అలీ, అమ్జద్పాషా, నాసర్, బాషామియా, అక్బర్, మైనొద్దీన్, లతీఫ్, ఖాజామియా, రఫీ, రజాక్పాషా, మహమూద్, రియాజుద్దీన్, హుస్సేన్, వళిబాషా, యాసీన్, యాకూబ్పాషా, షబ్బీర్, సాదిక్పాషా, యాకూబ్ అలీ, వసీం, యాజీద్పాషా, అఫ్సర్పాషా, మల్సూర్, బాబూమియా, మస్తాన్, మైపాషా, షరీఫ్, సిరాజుద్దీన్, నూరొద్దీన్ పాల్గొన్నారు. కొండూరు, కాట్రపల్లిలో అహ్మదీయ జమాత్ నేతృత్వంలో వేడుకలు జరిగాయి.
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు
నర్సంపేటలోని ఈద్గాలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత గురువు ముఫ్తీ షర్పోద్దీన్ సందేశం ఇచ్చారు. జామే మసీద్ కమిటీ అధ్యక్షుడు షరీఫ్, కమిటీ సభ్యులు ఖలీల్, హఫీజ్, ఇసాక్ అలీ, హుస్సేన్, కౌన్సిలర్ పాషా పాల్గొన్నారు. నెక్కొండలో మైనార్టీ నాయకుడు ఎస్కే షబ్బీర్ ఆహ్వానం మేరకు జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న రంజాన్ పండుగకు హాజరై అతడి కుటుంబ సభ్యులందరికీ దుస్తులు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, సొసైటీ చైర్మన్ మారం రాము, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, జడ్పీటీసీ లావుడ్యా సరోజన హరికిషన్, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్యాదవ్, టీఆర్ఎస్ నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, తాటిపెల్లి శివకుమార్, కొనిజేటి భిక్షపతి, వీరభద్రయ్య పాల్గొన్నారు. ఖానాపురం మండలవ్యాప్తంగా ముస్లింలు మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఖానాపురం, బుధరావుపేటలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, మైనార్టీ మండల అధ్యక్షుడు అన్వర్పాషా, మౌలానా, యాకూబ్పాషా, గులాంబాబా, నూర్మహ్మద్, గులాంనబీ పాల్గొన్నారు. చెన్నారావుపేటలో జరిగిన రంజాన్ వేడుకల్లో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ రఫీ, మండల కోఆప్షన్ సభ్యుడు ఎంఏ గఫార్, మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండీ అయ్యూం, వహీద్, జావీద్, భాషా, అంకూస్, రజాక్ పాల్గొన్నారు. దుగ్గొండి మండలవ్యాప్తంగా ముస్లింలు రంజాన్ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. రేబల్లె, దుగ్గొండి, పొనకల్, మందపల్లి, తిమ్మంపేటలోని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నర్సంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ముస్లింలు బంధుమిత్రులను ఇండ్లకు ఆహ్వానించి విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండలవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. నల్లబెల్లి మండలకేంద్రంలోని మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎస్సై రాజారాం పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
అల్లా దీవెనలతో చల్లగా ఉండాలి: ఎమ్మెల్యే నరేందర్
అల్లా దీవెనలతో అందరూ చల్లగా ఉండాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఎల్బీనగర్లోని ఈద్గా ఘనీ అబ్దుల్ అజీజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈదుల్ ఫితర్ నమాజ్కు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఈద్గా కమిటీ అధ్యక్షుడు ఎండీ సాదిక్, ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్దుల్లా, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్ ఎండీ ఫుర్ఖాన్, కమిటీ బాధ్యులు డాక్టర్ షేక్ హుస్సేన్, ఎండీ సర్వర్ పాషా, ఎంఎ ఖాదర్, ఎండీ వాజిద్ పాల్గొన్నారు. అలాగే, 12వ డివిజన్లోని టీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు ఎండీ అక్బర్ ఇంటికి కార్పొరేటర్ కావటి కవిత వెళ్లి కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగల సందర్భంగా అందరూ కలిసికట్టుగా వేడుకలు జరుపుకోవాలని సామాజికవేత్త అచ్చ వినోద్కుమార్ పిలుపునిచ్చారు. రంజాన్ సందర్భంగా వరంగల్ ఫోర్టురోడ్డులో ఆయన వృద్ధులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈద్గా కమిటీ సభ్యులు ప్రార్థనలు చేశారు. అలాగే, ఉర్సులోని నయాఘడీలో ఉర్సు దర్గా పీఠాధిపతి ఉబేద్బాబా, నవీద్బాబాను టీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట గడ్డం యుగేంధర్ ఉన్నారు.
ముస్లింల అలయ్ బలయ్
రంజాన్ను పురస్కరించుకొని ముస్లింలు మంగళవారం మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఒకరికొకరు అలయ్ బలయ్ తీసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గీసుగొండ మండలంతోపాటు గ్రేటర్ వరంగల్ 15, 16వ డివిజన్లలోని గ్రామాల్లో ముస్లింలు రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం మతపెద్దలు ఖురాన్ పఠించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సుంకరి శివకుమార్, బాబు, రమేశ్, రాజ్కుమార్, బాబు, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు. సంగెం మండలంలోని చింతలపల్లి, గవిచర్ల ఈద్గాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యుడు మన్సూర్ అలీ, ఇస్మాయిల్, ఖాజాపాషా, యాకూబ్పాషా, మైనోద్దిన్ పాల్గొన్నారు. పర్వతగిరి మండలంలోని అన్ని గ్రామాల్లో ముస్లింలు రంజాన్ను ఘనంగా జరుపుకున్నారు. అన్నారం దర్గా, గ్రామాల్లోని ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా , మండల కో ఆప్షన్ సభ్యులు సర్వర్, షబ్బీర్ అలీ పాల్గొన్నారు.