దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ధాన్యం సేకరణ
తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం
సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
వరంగల్రూరల్, మే 28(నమస్తేతెలంగాణ): సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో ధాన్యం దిగుబడులు గణనీయంగా పెరిగాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్సు హాలులో ధాన్యం కొనుగోలు, కరోనా కట్టడి, వానకాలం పంటల ప్ర ణాళికపై ఎమ్మెల్యేలు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడు తూ వరి ధాన్యం సేకరణలో కేంద్రప్రభుత్వం సహకరించకున్నా, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదన్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా లో యాభై శాతానికిపైగా యాసంగి ధాన్యాన్ని సేకరించినట్లు మంత్రి వెల్లడించారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. రైతుల కష్టాలు తెలిసిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.30 వేల కోట్ల రుణం తీసుకుని ధాన్యా న్ని సేకరిస్తున్నట్లు ఎర్రబెల్లి చెప్పా రు. నియోజకవర్గస్థాయిలో ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి వారం రోజుల్లో మొత్తం ధాన్యాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించారు.
ఇటీవల కురిసిన వర్షా లకు తడిసిన ధాన్యాన్ని కూడా సేకరించాలని చెప్పా రు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాసంగి 12,16, 900 టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంకాగా, ఇప్పటివరకు 7 లక్షలకుపైగా కొనుగోలు చేసినట్లు దయాకర్ రావు ప్రకటించారు. ధాన్యం సేకరణలో రైతలను ఇబ్బందిపెట్టే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. ధాన్యం రవాణాలో వాహనాల ఇబ్బంది ఉన్నందున రైతులు నేరుగా ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తీసుకొస్తే రవాణా చార్జీలను చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ప్రభుత్వ చర్యలతో కరోనా తగ్గుముఖం..
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట, పరకాలలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు అవసరమైన సదుపాయాలు కల్పించామన్నారు. అన్ని పీహెచ్సీల్లో కరోనా చికిత్స కోసం 5 నుంచి 10 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదే శించారు. మెడికల్ కిట్లను ఆశ వర్కర్ల వద్ద అందుబాటులో పెట్టాలని ఆయన సూచించారు.
విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి..
వానకాలం సీజన్ ప్రారంభం కానున్నందున విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా వ్యవసా యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే అవసరమైన మేరకు జిల్లాకు చేరుకున్నాయని చెప్పారు. రైతు వేదికల్లో ఎరువులను నిల్వ చేసుకునేలా చూడాలని అధికారులకు సూ చించారు. రైతులు నష్టపోకుండా టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు సమీక్షించాలని వ్యవసాయశాఖ అధికారులను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఎం హరిత మాట్లాడుతూ ధాన్యం దిగుబడి ఎక్కువగా రావడం వల్ల ఈసారి గోనె సంచుల సమస్య ఏర్పడిందని అన్నారు. రెండురోజుల్లో ఈ సమస్య తీరిపోనుందని ఆమె చెప్పారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎంపీలు పసునూరి దయాకర్, బండా ప్రకాశ్, నర్సంపేట, భూపాలపల్లి, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, అరూరి రమేశ్, జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్డీవో సంపత్రావు, జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్, డీఎంహెచ్వో మధుసూదన్ పాల్గొన్నారు.