రైతు వ్యతిరేక పార్టీలో చేరిన ల సమాధానం చెప్పాలి
తెలంగాణ ద్రోహుల పార్టీ బీజేపీ
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
కమలాపూర్ మండలం శనిగరంలో కార్యకర్తల సమావేశం
నడికూడ మండలంలో డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
కమలాపూర్/నడికూడ, జూన్ 20 : ఏడేండ్లుగా రాష్ట్ర మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఏం చేసిండు.. ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బులు ఇచ్చినా ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టియ్యలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామంలో రూ.5కోట్లతో గూనిపర్తి-చెర్లపల్లి డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రైతువేదిక భవనాన్ని ప్రజలకు అంకితం చేశారు. మండల స్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలంలో డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే సీఎం కేసీఆర్ వ్యతిరేకించినట్లు తెలిపారు. నల్లచట్టాలు రద్దు చేయాలని ఢిల్లీలో పంజాబ్ రైతులు ధర్నా చేస్తున్నది మనం చూస్తలేమా? అలాంటి రైతు వ్యతిరేక పార్టీలో చేరిన ఈటల ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా ధాన్యం కొనడం లేదన్నారు. ఛత్తీస్గఢ్లో రూ.1300, కర్ణాటకలో రూ.1500 మద్దతు ధర ఇస్తుంటే, మన రాష్ట్రంలో మాత్రం రూ.1888 కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాకముందు సాగునీరు, కరంటు కోసం ఇబ్బందులు పడ్డామని, రాష్ట్రం వచ్చాక కేసీఆర్ దయవల్ల కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి వద్దన్నా సాగునీళ్లు వస్తున్నాయన్నారు. రైతులకు 24గంటల ఉచిత కరంటు, రైతుబంధు, బీమా ఇస్తున్నది వాస్తవం కాదా ఆలోచన చేయాలన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏ రాష్ట్రంలోనైనా రైతుబంధు ఇస్తుందా అని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని బీజేపీ రానున్న రోజుల్లో తెలంగాణలో కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. కరోనా కాలంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ.. అక్రమ ఆస్తులు కాపాడుకునేందుకే ఈటల బీజేపీలో చేరిండని, తెలంగాణకు ఆ పార్టీ చేసిందేమీ లేదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నదని విమర్శించారు. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ఆత్మగౌరవం ఎక్కడ ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని, మరో విడుత గొర్ల పంపీణీ చేపట్టి గొల్లకురుమలకు న్యాయం చేస్తామన్నారు. శనిగరం, గోపాల్పూర్, మాధన్నపేట, గూనిపర్తి, బత్తినివానిపల్లి గ్రామాలకు వెళ్లే డీబీఎం-24 కాల్వను పునర్నిర్మించి, సాగునీరు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నడికూడ మండలంతో పాటు చుట్టు పక్కల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని, రోడ్డు వెడల్పుకు గ్రామస్తులు సహకరించాలన్నారు. పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు మంత్రి కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ఎవరి కోసం రాజీనామా చేశాడో ప్రజలు ఆలోచించాలన్నారు.
అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు బీజేపీలో చేరినట్లు తెలిపారు. పరకాల రెవెన్యూ డివిజన్, నడికూడ మండల ఏర్పాటుకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చాలా కృషి చేశారని, తుది నిర్ణయాన్ని తామిద్దరం పరిశీలించామన్నారు. నూతన మండలంలో మోడల్ గ్రామ పంచాయతీ నిర్మాణానికి రూ.25లక్షలు సమకూరుస్తానని తెలిపారు. జడ్పీచైర్మన్ సుధీర్కుమార్ మాట్లాడుతూ.. ఆత్మాభిమానం ఢిల్లీ నడిబజారులో తాకట్టు పెట్టిన ఘనత ఈటల రాజేందర్ది అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం అంతర్జాతీయ చానల్ డిస్కవరీలో ప్రసారం కాబోతుందని, వీక్షించాలన్నారు. కమలాపూర్లో ఇన్చార్జి పేర్యాల రవీందర్రావు, వాసుదేవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, వకుళాభరణం కృష్ణమోహన్రావు, సింగిల్విండో చైర్మన్ సంపత్రావు, జడ్పీటీసీ లాండిగ కల్యాణి, సర్పంచ్లు రవళి, విజయ, రవీందర్రెడ్డి, విజేందర్రెడ్డి, ఎంపీటీసీలు భాస్కర్రావు, వెంకటేశ్వర్లు, పరకాల మున్సిపల్ చైర్పర్సన్ అనితారామకృష్ణ, నడికూడలో జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఏసీపీ శ్రీనివాస్, సర్పంచ్ ఊర రవీందర్రావు, జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్, జడ్పీటీసీ కొడెపాక సుమలత, ఎంపీపీ మచ్చ అనసూర్య, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చందు తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
దామెర, జూన్ 20 : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. ఆదివారం ఆయన దామెర మండల కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పల్లెప్రగతి పనులు పరిశీలించి మాట్లాడారు. గ్రామాల్లో చెత్తచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డులకు తరలించాలన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపీపీ కాగితాల శంకర్, ఎంపీటీసీ పోలం కృపాకర్రెడ్డి ఉన్నారు. అనంతరం మంత్రి మండల కేంద్రంలో డ్రైనేజీల్లో మురుగును తొలగిస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి పనులు బాగా చేస్తున్నారు.. వెరీగుడ్ అంటూ కితాబు ఇచ్చారు.
సంపూర్ణ ఆరోగ్యానికి యోగా చేయండి
హన్మకొండ, జూన్ 20 : సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ యోగా చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపాలని ఐక్యరాజ్యసమితి 2014లో తీర్మానం చేసిందన్నారు. కరోనా వేళ సంపూర్ణ ఆరోగ్యం, రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ తప్పక యోగా చేయాలని మంత్రి సూచించారు.