గీసుగొండ, ఏప్రిల్ 1 : కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి రథోత్సవం గురువారం రాత్రి కనుల పండువగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని రథాన్ని అర్చకులు ఉదయం పూజలు చేసి, ప్రత్యేకంగా అలంకరించారు. భూ, నీలాదేవీ సమేత లక్ష్మీనర్సింహస్వామి విగ్రహాలను అర్చకుడు కాండూరి రామాచార్యులు ఆధ్వర్యంలో భక్తుల కోలాహలం మధ్య గుట్టుపై నుంచి తీసుకొచ్చారు. ప్రత్యేక పూజలు చేసి, రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ వేడుకను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గోవింద నామస్మరణతో రథాన్ని గుట్ట చుట్టూ తిప్పారు. కరోనా కారణంగా ఈ ఏడాది రాత్రి 9 గంటల వరకే రథోత్సవాన్ని ముగించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గీసుగొండ సీఐ రాయల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో కమల, ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, ఉత్సవ కమిటీ చైర్మన్ గడ్డమీది కుమారస్వామి, డైరెక్టర్లు తిరుపతి, శ్రీనివాస్, స్వాతి, రాజేశ్వర్రావు, రామారావు, రమేశ్, ఆలయ సిబ్బంది కనకయ్య, వీరస్వామి పాల్గొన్నారు. కాగా, శనివారంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తుండడంతో స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ పెరుగుతోంది.
ఇవి కూడా చుడండి
పాలు తాగించి.. పసిబిడ్డ పై పిడిగుద్దులు
మిక్సీగ్రైండర్లలో బంగారం స్మగ్లింగ్