శంషాబాద్, మార్చి 31: మిక్సీ గ్రైండర్ల మోటర్లలో అక్రమంగా బంగారం తరలిస్తున్న ఐదుగురు స్మగ్లర్లను శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు బుధవారం అరెస్టుచేశారు. అధికారుల వివరాల ప్రకారం.. శంషాబాద్ ఎయిర్పోర్టుకు దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఐదుగురు అనుమానాస్పదంగా కనిపించారు. కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకొని సోదాచేశారు. వారి లగేజీని కూడా తనిఖీచేశారు. వారు తెచ్చిన మిక్సీ గ్రైండర్ల మోటర్లలో ముక్కలుగా అమర్చిన బంగారాన్ని అధికారులు గుర్తించారు. ఆ బంగారం 2.5 కిలో గ్రాముల బరువు ఉన్నది. దాని విలువ రూ.1.15 కోట్లు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రూ.21.48 లక్షల విలువైన యూఎస్ డాలర్లు పట్టివేత
శంషాబాద్ ఎయిర్పోర్టులో బుధవారం రూ.21.48 లక్షల విలువైన యూఎస్ డాలర్లు పట్టుబడ్డాయి. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజ్ బ్యాగును సీఐఎస్ఎఫ్ అధికారులు సోదాచేయగా.. 30,000 యుఎస్ డాలర్లు లభించాయి. అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.