హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ)/ఎల్బీనగర్: పసి పిల్లలను చూస్తే ముద్దు చేస్తుంటారు. బోసి నవ్వులు చూసి సంబురపడిపోతుంటారు. కానీ, ఓ కిరాతకుడు.. ఓ మహిళతో వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ఆమె 18 నెలల పసిబిడ్డను అతి దారుణంగా చంపేశాడు. కడుపు నిండా పాలుతాగించి.. ఛాతి, గొంతు, తలపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. పాలు తాగిస్తే వాంతి చేసుకుని చనిపోయాడని కట్టుకథ అల్లి ఎట్టకేలకు దొరికి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన సరూర్నగర్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. బోరబండ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలకు 18 నెలల కుమారుడు రోహిత్ రెక్వాల్ ఉన్నాడు. ఇటీవల దంపతుల మధ్య గొడవలు జరిగాయి. జనవరి నుంచి కొడుకు రోహిత్ను తీసుకుని భార్య సరూర్నగర్ కోదండరాంనగర్ కాలనీలో రాజు అనే మరో వ్యక్తితో కలిసి ఉంటున్నది. అప్పుడప్పుడు భర్తకు ఫోన్చేసి వీడియోకాల్ మాట్లాడి బాబును చూపించేది.
ఎక్కడ ఉంటున్న విషయాన్ని చెప్పేదికాదు. మార్చి 28న రోహిత్ను రాజు దగ్గర వదిలిపెట్టి క్యాటరింగ్ పనికోసం వెళ్లింది. తిరిగి ఇంటికెళ్లే సరికి.. బాబు పాలువాంతి చేసుకుని అపస్మారక స్థితిలో ఉన్నాడని రాజు చెప్పడంతో స్థానిక దవాఖానకు తీసుకెళ్లింది. అప్పటికే బాబు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. వెంటనే విషయాన్ని భర్తకు తెలిపింది. ఘటనపై అనుమానం వ్యక్తంచేస్తూ రోహిత్ తండ్రి పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదుచేశారు. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ చేశారు. అనుమానంతో రాజును విచారించారు. మొదట బుకాయించిన రాజు.. ఆ తర్వాత తానే పిడి గుద్దులు గుది బాలుడిని చంపేశానని అంగీకరించాడు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని, బాబు ఉంటే ఆమె తిరిగి తన భర్త దగ్గరకు వెళ్లిపోతుందనే ఆలోచనతో చంపేశానని చెప్పాడు. పోలీసులు బుధవారం రాజును అరెస్టు చేశారు.