సుబేదారి, ఏప్రిల్ 28: పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలకు ఆదివారం నిర్వహించనున్న తుది రాత పరీక్షకు వరంగల్ పోలీస్ కమిషరేట్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో మొత్తం 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, 1204 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని, ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుందని సీపీ తెలిపారు.
కాగా, అభ్యర్థులను అరగంట ముందుగానే హాల్లోకి అనుమతిస్తారని, పోలీసు నియామక బోర్డు నుంచి జారీ చేసిన హాల్ టికెట్తోపాటు ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్.. ఇలా ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని అన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, బ్యాగులు, సెల్ఫోన్ వెంట తీసుకెళ్లద్దన్నారు. అభ్యర్థులను పోలీసు సిబ్బంది తనిఖీ చేసిన అనంతరం సెంటర్ లోపలికి పంపిస్తారని, ఓఎంఆర్ షీట్ మీదా గుర్తులు కానీ, మతపరమైన చిహ్నాలు, ప్రార్థనలు రాయొద్దన్నారు. ఒక అభ్యర్థికి బదులు మరో అభ్యర్థి పరీక్ష రాస్తే అభ్యర్థి పరీక్షను రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్ష హాల్లో అభ్యర్థి ఫొటో, వేలిముద్రలు కుణ్ణంగా పరిశీలిస్తారని తెలిపారు. బ్లూ పెన్ను లేదా బ్లాక్ పెన్నుతోనే జవాబు పత్రం పూరించాలని అభ్యర్థులకు సీపీ సూచించారు.