సుబేదారి, ఆగస్టు 28: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్స్కు చెక్ పడనుంది. బాధితులకు సత్వర న్యాయం జరగనుంది. సోషల్మీడియా వేదికగా కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. స్మార్ట్ఫోన్ల ద్వారా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి వాటి ద్వారా ఓటీపీ ఫ్రాడ్స్, క్రెడిట్కార్డు, లోన్లు, గిఫ్ట్ వోచర్స్, నకిలీ అకౌంట్స్తో ఫేస్ మార్ఫింగ్తో యువతులను వేధించడం వంటి నేరాలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. వివిధ రకాల యాప్ల ద్వారా ప్రజలకు ఎర వేసి సైబర్ క్రిమినల్స్ డబ్బులు లాగుతున్నారు. ఈరోజుల్లో టెక్నాలజీ వాడకం అనేది తప్పనిసరిగా మారింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో మనీ ట్రాన్స్ఫర్, ఆన్లైన్ షాపింగ్తో లావాదేవీలన్నీ దాని ద్వారా చేస్తున్నారు. సోషల్ మీడియా వాడకం కూడా తప్పనిసరిగా మారింది. ఈక్రమంలో వీటి ద్వారా కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. తెలంగాణ స్టేట్లో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్లో కొద్ది సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 2023 నుంచి ఆగస్టు 26 పోలీసు కమిషనరేట్ పరిధిలోని 46 పోలీస్ స్టేషన్ల నుంచి రోజూ పదుల సంఖ్యలో సైబర్ నేరస్తులతో మోసపోయామని బాధితుల నుంచి స్థానిక పోలీస్ స్టేషన్, టోల్ఫ్రీ నంబర్ 1930, సైబర్ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ పోలీసులకు శాంతిభద్రత పరిరక్షణ, ఇతర కేసుల నమోదు దర్యాప్తు వల్ల సైబర్ క్రైమ్స్ ఫిర్యాదుల దర్యాప్తు విషయంలో ఆలస్యమవుతోంది. ఈనేపథ్యంలో సైబర్ నేరాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి పోలీసు కమిషనరేట్కు ప్రత్యేకంగా సైబర్ క్రైమ్స్ పోలీసు స్టేషన్ మంజూరు చేసింది. ఈక్రమంలో వరంగల్ పోలీసు కమిషనరేట్కు కూడా మంజూరైంది. తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు అనుసంధానంగా పనిచేస్తాయి. నిందితులను పట్టుకోవడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. ఇన్వెస్టిగేషన్ కోసం సాంకేతిక నిపుణులను నియమిస్తారు.
కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు
వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఆదునిక పరిజ్ఞానంతో సైబర్ క్రైమ్స్ పోలీసు స్టేషన్ను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఈస్టేషన్ పర్యవేక్షణ అధికారిగా ఏసీపీ స్థాయి అదికారి, ఒక ఇన్స్పెక్టర్ కూడా నియమాకమయ్యారు. స్టేషన్ ఏర్పాటు తర్వాత ముగ్గురు ఎస్సైలు, 12మంది టెక్నికల్ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ను తెలంగాణ స్టేట్ పోలీసు శాఖ సైబర్ విభాగం నుంచి నియమిస్తారు. కొద్ది రోజుల్లో సైబర్ క్రైమ్స్ పోలీసు స్టేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరస్తుల చేతిలో మోస పోయిన బాధితులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేయాలి. వెంటనే పోలీసులు కేసు నమోదు చేస్తారు. టెక్నికల్ సిబ్బందితో దర్యాప్తు చేసి ఆదారాలు సేకరిస్తారు.పోగొట్టున్న డబ్బులను నిందితుడు తీసుకోకుండా బ్లాక్ చేపిస్తారు. సాంకేతిక నిపుణులతో విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేస్తారు. ప్రత్యేక కోర్టు ద్వారా జైలుకు పంపిస్తారు. బాధితులకు సత్వర న్యాయం జరుగుంతుంది.సైబర్ క్రైమ్స్ పోలీసు స్టేషన్కు అనుసంధనంగా విచారణ కోసం కమిషనరేట్ కార్యాలయంలో ఇప్పుడున్న సైబర్ క్రైమ్స్ ల్యాబ్ నుంచి సాంకేతిక ఆధారాలు సేకరిస్తారు.
ఏర్పాట్లు జరుగుతున్నాయి
తెలంగాణ ప్రభుత్వం వరంగల్ పోలీసు కమిషనరేట్కు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మంజూరు చేసింది. ఏసీపీగా విజయకుమార్ బాధ్యతలు చేపట్టారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో టెంపరరీగా స్టేషన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లో ప్రత్యేకంగా బిల్డింగ్ నిర్మాణం చేపడుతాం.
– ఏవీ రంగనాథ్, పోలీసు కమిషనర్