కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు గురువారం నుంచి జనవరి 3వ తేదీ వరకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఇందుకోసం కేయూ మైదానంలో ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సీసీ కెమెరాల నిఘా మధ్య పారదర్శకంగా ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు దళారుల మాటలు నమ్మి మోసపోవొద్దని సూచించారు. ధ్రువపత్రాలు, ఆహార పానీయాలు, దుస్తులు, అత్యవసర వసు ్తసామగ్రి తప్ప బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను వెంట తీసుకురావొద్దని పేర్కొన్నారు.
సుభేదారి, డిసెంబర్ 7: కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్ధులకు నిర్వహించనున్న దేహదారుఢ్య పరీక్షలు ఈ నెల 8 నుంచి జనవరి 3వ తేదీ వరకు కాకతీయ యూనివర్సిటీ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాధ్ అన్నారు. అభ్యర్ధులు పూర్తిస్థాయిలో సిద్ధమై ఎంపికల ప్రక్రియకు హాజరుకావాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన చేశారు. ఎంపికల ప్రక్రియలో అన్ని పరీక్షలు పారదర్శకంగా సీసీ కెమెరాల నిఘాలో నిర్వహిస్తామని రంగానాథ్ పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఎంపిక ప్రక్రియలో సహకరిస్తామని దళారులు చెప్పే మాట లు నమ్మి మోసపోవద్దని అన్నారు. దళారుల వివరాలను నేరుగా గాని, పోలీస్ కమిషనర్ నంబర్ 94910 89100 లేదా పరిపాలన విభాగం అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ 9440795201 నంబర్లకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.
దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సీపీ సూచనలు చేశారు. నిర్దేషించిన తేదీన ఉదయం ఐదు గంటల లోపు అభ్యర్థులు కాకతీయ యూనివర్సిటీకి చేరుకోవాలని కోరారు. బయోమెట్రిక్ పద్ధతిలో అభ్యర్ధుల పరిశీలన ఉన్నందున చేతి వేళ్లకు గోరింటాకు, లేదా మరే ఇతర రంగులు అంటించుకోకుండా చూసుకోవాలన్నారు. సమయపాలన పాటించని అభ్యర్ధుల అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారని తెలిపారు. అభ్యర్ధులు తమ వెంట రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి జారీ చేసిన అనుమతి సమాచార పత్రం, అడ్మిట్ కార్డు, ఇంటిమేషన్ లెటర్ను వెంట తీసుకుని రావాలని సూచించారు.
అభ్యర్ధులు స్వీయ సంతకంతో కూడిన పార్టు2 దరఖాస్తు ఫారం, నో అబ్జక్షన్ సర్టిఫికేట్తో మాజీ సైనికులు తమ వెంట ధృవీకరణ పత్రాన్ని వెంట తీసుకురావాలని సూచించారు. గిరిజన ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ట్రైబల్ వెల్ఫేర్ జారీ చేసిన ఏజెన్సీ ఏరియా ధ్రువీకరణ పత్రాలను వెంట తీసుకురావాలని సీపీ సూచించారు. పురుషులకు 1600 మీటర్లు, మహిళలకు 800 మీటర్ల పరుగు పందెం నిర్వహిస్తారని తెలిపారు.ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు మాత్రమే ఎత్తు, లాంగ్ జంప్, షార్ట్పుట్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ఎంపికల సమయంలో అభ్యర్ధులకు ధరింపజేసిన రిస్ట్ బ్యాండ్స్ తొలగించడం, పాడు చేయడం చేసినట్లయితే అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారన్నారు. పరీక్ష కేంద్రానికి చేరుకున్న తరువాత పరీక్షలు పూర్తయ్యిన తరువాత మాత్రమే మైదానం విడిచే అవకాశం ఉంటుందన్నారు. అభ్యర్ధులు తమ వెంట తెచ్చుకున్న సామగ్రిని భద్రపరచుకోవడానికి ఎలాంటి క్లాక్ రూంలు ఏర్పాటు చేయలేదని, అభ్యర్ధులు ఈ విషయాన్ని గమనించి ధృవపత్రాలు, ఆహార పానియాలు, దుస్తులు అత్యవసర వస్తుసామగ్రి తప్ప బంగారు ఆభరణాలు, నిషేధిత ఇతరత్రా వస్తువులను వెంటతీసుకురావొద్దని తెలిపారు. ద్విచక్ర వాహనాల ద్వారా వచ్చే అభ్యర్ధులు కాకతీయ విశ్వవిద్యాలయం మొదటి గేటు మీదుగా ఎంపికల కేంద్రానికి హాజరు కావాలన్నారు. ఎంపికల ప్రక్రియలో ధృవపత్రాల పరిశీలన, ప్రతి ఈవెంట్స్లో తప్పని సరిగా ఓపికతో, క్యూలైన్ పద్ధతిని పాటించాలని సూచించారు.