వరంగల్ : 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వర్థన్నపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల పోలింగ్ బూత్ల పునర్వ్యవస్థీకరణపై ఆయన సమీక్ష సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18ఏండ్లు నిండిన వారిని ఓటరుగా నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీలు చోరవ చూపాలని అన్నారు.
పోలింగ్ కేంద్రంలో 1500 ఓటర్లు మాత్రమే ఉండాలని అంతకంటే ఎక్కువ ఓటర్లు ఉంటే అదనంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అయన ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని అన్నారు. అవసరం అయితే కొత్త భవనాలలో పోలింగ్ కేంద్రాలకు కేటాయించాలని అన్నారు. నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితా విడుదల అవుతుందన్నారు. నవంబర్ నెలలో శని, ఆది వారాలలో ఓటరు నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. 2022 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ అర్హులైన వారిందరిని ఓటర్లుగా నమోదు చేయించాలని కోరారు.
సమావేశంలో ఎలక్షన్ డిప్యూటీ తాసిల్దార్ రామారావు, రాజకీయ పార్టీల నుంచి రావు అమరేందర్రెడ్డి, ఈవీ శ్రీనివాసరావు, ఇండ్ల నాగేశ్వర్రావు, సీతారాజ్కుమార్, ప్రభాకర్రెడ్డి, శ్యామ్సుందర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.