తొర్రూరు, సెప్టెంబర్ 2 : అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా చూస్తున్న సీఎం కేసీఆర్ దేశంలోనే రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలుపుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని కొనియాడారు. తొర్రూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో లబ్ధిదారులకు పింఛన్కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అంతకు ముందు జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, మున్సిపల్ పాలకవర్గం ప్రతినిధులు, అధికారులతో కలిసి రూ.12 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన స్వర్గరథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, ఈ ఘనత సీఎం కేసీఆర్కే దుక్కుతుందని చెప్పారు.
కరోనా కష్టకాలలో సైతం అభివృద్ధి, సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా అమలు చేస్తున్నారని చెప్పారు. ఒకవైపు అభివృద్ధిని కొనసాగిస్తూనే మరోవైపు ప్రజల సంక్షేమానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇంత పెద్ద మొత్తంలో ఆసరా పింఛన్లు ఇస్తున్నారా ప్రజలు పరిశీలించాలని, ఆ పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో సవాలక్ష నిబంధనలు పెట్టి రూ.600కు మించి పింఛన్ ఇస్తున్న దాఖలాలు లేవన్నారు. పట్టణంలో పాల కేంద్రం వరకు సెంట్రల్ లైటింగ్, కంఠాయపాలెం రోడ్డును డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాకే 20 లక్షలుగా ఉన్న పెన్షన్ల సంఖ్యను 40 లక్షలకు చేరిందని వెల్లడించారు.
65 సంవత్సరాల వయస్సు నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి మరో 10 లక్షల మందికి కొత్తగా పింఛన్లు అందజేస్తూ ఆదుకుంటున్నామన్నారు. కేంద్రం రూ.200 కోట్లు మాత్రమే ఇస్తూ 6 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తుందని, అదే తెలంగాణ ప్రభుత్వం సుమారు ఆరకోటి మందికి ఏడాదికి రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.200 మించని పింఛన్ను రెండు సార్లు పెంచి వృద్ధులు, ఇతరులకు రూ.2016, దివ్యాంగులకు రూ.3016 ఇస్తున్నామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రూ.100 నుంచి రూ.500కు మించడం లేదని వివరించారు. తాజాగా డయాలసిస్ పేషంట్లకు కూడా పెన్షన్లు అందజేస్తున్నామని అన్నారు. మ్యానిఫెస్టోలో లేని పథకాలను అమలు చేస్తున్న మహోన్నతమైన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో నెలకు 1453 మందికి గతంలో అందజేయగా, 561 మందికి నూతనంగా పెన్షన్ మంజూరైందని వివరించారు.
మానుకోట జిల్లాలో 1,16,914 మందికి పింఛన్లు
వివిధ రకాల పెన్షన్లకు సంబంధించి రూ.43.42 లక్షలు ఒక్క తొర్రూరు పట్టణంలోనే అందిస్తున్నట్లు వివరించారు. 90,176 పాతవి, కొత్తగా 26,198 మందిని కలుపుకుని జిల్లా వ్యాప్తంగా 1,16,914 మందికి నెలకు రూ.27.19 కోట్లు ఆసరా పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ నూతన పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో 80శాతానికి పైబడి పెన్షన్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు.