హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 2 : ‘అంతరించి పోతున్న కళలను బతికించుకుందాం.. కళాకారులకు టీఆర్ఎస్ సర్కారు అండగా ఉంటున్నది.. వారిని ఆదుకునేందుకు కృషి చేస్తున్నది.. తెలంగాణ సంస్కృతిక సారథి ద్వారా ప్రోత్సహిస్తున్నది’ అని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ పేర్కొన్నారు. ప్రముఖ రంగస్థల కళాకారుడు పందిళ్ల శేఖర్బాబు స్మారక నాటకోత్సవాలు తెలంగాణ రాష్ట్ర భాషాసాంస్కృతిక శాఖ, చలనచిత్ర అభివృద్ధి సంస్థ సౌజన్యంతో హనుమకొండ పబ్లిక్గార్డెన్లోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాసర్, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ ‘పందిళ్ల శేఖర్బాబు కుటుంబ సభ్యుల్లో నేను ఒకడిని’ అని గుర్తు చేశారు. యాంత్రిక జీవనంలో కళలను గానీ, కళాకారులను గానీ అభినందించలేని దుస్థితిలో ప్రజలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, వారి ప్రదర్శనలతో ప్రజలు ఎంతో చైతన్యవంతులవుతారని చెప్పారు. శేఖర్బాబు భౌతికంగా లేకపోయినా ఆయన ప్రదర్శించిన నాటకాలు, కళానైపుణ్యం సజీవంగా ఉన్నాయని గుర్తుచేశారు. కళాకారులకు కొత్త పింఛన్ల విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. శేఖర్బాబు నాటక రంగానికి ఎనలేని సేవ చేశారని, ఎంతోమంది కళాకారులకు శిక్షణనిచ్చి రాష్ట్రంలో అనేకచోట్ల ప్రదర్శనలు ఇప్పించారని, ఆయన జయంతిని పురస్కరించుకొని యేటా శేఖర్ బాబు స్మారక అవార్డు ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు.
ఆయన జీవిత కాలం నాటకాలను ప్రేమించారు : దేశపతి
సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ కళాకారులకు కొత్త పింఛన్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. శేఖర్బాబు జీవితకాలం నాటకాలనే ప్రేమించారని గుర్తు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో సరుకులా మనుషుల మధ్య పోటీ నెలకొందని, కృతిమ వాతావరణంలోపడి కళలను కోల్పోతున్నారని, మంచి పాట, నాటకాన్ని ఆస్వాదించలేకపోతున్నారని ఆవేదన చెందారు. అద్భుతమైన కళలను కాపాడుకోవాల్సిన అవసరముందని, కళాత్మక వాతావరణంలో పిల్లలను యంత్రాల్లా మార్చవద్దని సూచించారు. కాకతీయుల గడ్డ కళాకారుల నిలయమని, ఎంతోమంది కళాకారులు జన్మించిన ఈ గడ్డపై పందిళ్ల శేఖర్ బాబు లాంటి కళాకారులు నాటక రంగానికి, నాటక సమాజానికి ఎనలేని సేవలు చేశారని, ఆయన జయంతి సందర్భంగా మూడురోజుల పాటు నాటకోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీపీఆర్వో జీ లక్ష్మణ్కుమార్, తడకమళ్ల రామచందర్, పందిళ్ల రమేశ్బాబు, గంట రవికుమార్, శ్రీరామోజు సుందరమూర్తి, సంస్థ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంతారావు, ప్రధాన కార్యదర్శి ఆకుల సదానందం, బోయినపల్లి పురుషోత్తమరావు, తిరుమలయ్య, గూడూరు బాలాజీ, నిమ్మల శ్రీనివాస్, దేవరాజు రవీందర్రావు, వోడపల్లి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
సురేందర్రాజుకు శేఖర్ బాబు పురసారం
యేటా ప్రసిద్ధ కళాకారులకు ఇచ్చే పందిళ్ల శేఖర్బాబు స్మారక పురస్కారాన్ని ఈ యేడు చక్రహరి సురేందర్రాజుకు శేఖర్ బాబు సోదరులు, ముఖ్యఅతిథులు దాస్యం, దేశపతి చేతుల మీదుగా ప్రదానం చేశారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించి అభినందించారు. ఇక్కడ అవార్డు గ్రహీత సురేందర్రాజు మాట్లాడుతూ పందిళ్ల శేఖర్బాబు పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
అలరించిన నాటకం..
మిర్యాలగూడ సాంసృతిక కళా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రావణ’ నాటక ప్రదర్శన ఎంతగానో అలరించింది. ఇందులో నారదుడిగా గుండు వెంకటేశ్వర్లు, వాల్మీకిగా వీ జానకిరామశర్మ, రావణుడిగా బీ భుజంగరావు, నంది-పీ వెంకటేశ్వర్లు, శంకరుడిగా జీ బాపనయ్య, వేదవతి/సీతగా సురభి రమాలక్ష్మి, మండోదరిగా సురభి వెంగమాంబ, విభీషణుడిగా డీ శివరాంనాయక్, ఇంద్రజిత్తుగా ఎస్కే ముస్తఫా, రాముడిగా బీ వెంకటశివ, లక్ష్మణుడిగా పీ లక్ష్మీనారాయణశర్మ, శూర్పణఖగా డీ లక్ష్మి, మాయా రావణుడిగా డీ శ్రీనివాసశర్మ, ఆంజనేయుడిగా పీ కృష్ణమూర్తి, సుగ్రీవుడిగా డీ వెంకటేశ్వర్లు నాటకాన్ని రక్తికట్టించారు. వెంకటేశ్వర్లు సంగీతం అందించగా, సీహెచ్ బాబూరావు సహాయకుడిగా వ్యవహరించారు. తబలా, కీబోర్డును నాగేందర్ ప్లే చేశారు. బీ వెంకటస్వామి ఆహార్యం, సురభి సంతోష్ బృందం సభ్యులు సెట్టింగ్స్ అండ్ లైటింగ్ బాధ్యతలు, రచన, దర్శకత్వ బాధ్యతలు తడకమళ్ల రాంచందర్రావు, నిర్వహణ బాధ్యతలు పులి కృష్ణమూర్తి చూసుకున్నారు.