వరంగల్చౌరస్తా/వర్ధన్నపేట/చెన్నారావుపేట/సంగెం/నర్సంపేటరూరల్/ఖిలావరంగల్/మట్టెవాడ, ఆగస్టు 19: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రజలు ఐక్యతను చాటుతున్నారు. ప్రతి రోజూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా పండ్లు, స్వీట్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. వరంగల్లోని సీకేఎం దవాఖానలో గర్భిణులు, బాలింతలకు టీఆర్ఎస్ నాయకులు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు.
డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన, మార్కెట్ కమిటీ మాజీ చైర్మర్ టీ రమేశ్బాబు, వైద్యులు పాల్గొన్నారు. అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ శ్రీవత్స, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ, వైద్యులు పాల్గొన్నారు.
వర్ధన్నపేటలోని కమ్యునిటీ హెల్త్ సెంటర్లో పండ్లు పంపిణీ చేశారు. ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, కమిషనర్ గొడిశాల రవీందర్, పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్ఖన్నా, తాసిల్దార్ నాగరాజు, సూపరింటెండెంట్ నర్సింహస్వామి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. చెన్నారావుపేట సర్పంచ్ కుండె మల్లయ్య కేజీబీవీలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహంచారు. జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, రాంబాబు, శ్రీధర్రెడ్డి, పాఠశాల ప్రత్యేకాధికారి జ్యోతి పాల్గొన్నారు.
అలాగే, సంగెంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఎంపీపీ కందకట్ల కళావతి, పాఠశాల ప్రత్యేకాధికారి నీలిమ, ఎంపీటీసీ మల్లయ్య, ఏపీవో లక్ష్మి పాల్గొన్నారు. నర్సంపేట పట్టణం 5వ వార్డు నర్సంపేట-మహబూబాబాద్ ప్రధాన రహదారి సమీపంలోని మదర్సాలో నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి విద్యార్థినులకు పండ్లు పంపిణీ చేశారు.
మున్సిపల్ కమిషనర్ నాయిని వెంకటస్వామి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇటుకాలపల్లి, భాంజీపేట, చంద్రయ్యపల్లి, లక్నేపల్లి, ముత్తోజిపేట, మాదన్నపేట, కమ్మపల్లిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మామునూరులోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నటీ విశ్వవిద్యాలయంలోని యానిమల్ హస్బెండ్రీ పాలిటెక్నిక్ అధ్యాపకులు, విద్యార్థులు శివనగర్లోని నవజీవన్ డాన్బోస్కో వీధి బాలల హోంను సందర్శించారు.
చిన్నారులకు క్రీడా సామగ్రితోపాటు పెన్నులు, పుస్తకాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అలాగే వృద్ధులకు దుప్పట్లు, పండ్లు అందించారు. వరంగల్ ఎంజీఎం దవాఖానలో మట్టెవాడ ఇన్స్పెక్టర్ సీహెచ్ రమేశ్ 150 మంది రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే, ఓపీ కౌంటర్ వద్ద సీసీ కెమెరాలను ప్రారంభించారు.