ఏటూరునాగారం/ మంగపేట/ వాజేడు, ఆగస్టు 17 : రెండు రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి క్రమంగా తగ్గుతుంది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద బుధవారం సాయంత్రం వరకు కూడా రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే ప్రవహిస్తుంది. అయితే మంగళవారం సాయంత్రం 16.240 మీటర్ల వరకు చేరుకున్న గోదావరి క్రమంగా తగ్గుతూ 15.990 మీటర్ల చేరింది. అయినా పంట భూములు నీటిలోనే మునిగి ఉన్నాయి. రామన్నగూడెం-రాంనగర్ మధ్యలోని రోడ్డుపై కాస్త వరద తగ్గింది.
మంగపేట మం డలం కమలాపురం ఇన్టేక్ వెల్ వద్ద 82.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తున్నది. నీటిమట్టం మీటరు తగ్గడంతో తీర ప్రాంతంలో ముంపుకు గురైన వరి నాట్లు తేలాయి. వాజేడు మండలంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు పేరూరు వద్ద 13. 380 మీటర్ల మేర ప్రవహించిన గోదావరి బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు 14.820 మీటర్లకు తగ్గి ప్రవహిస్తున్నట్లు సీడబ్యూసీ అధికారులు విలేక రులకు తెలిపారు. వాజేడు నాగారం బీసీ కాలనీ వద్ద ఉధృతంగా ప్రవహించిన గోదావరి క్రమంగా తగ్గుతుండడంతో కాలనీ వాసులు భయం వీడుతున్నారు. వరదతో ప్రమాదం ఉంటుందని భావించినప్పటికీ తగ్గుముఖం పట్టడంతో ముంపు ప్రాంతాల ప్రజలు కాస్త ఊరిపి పీల్చుకున్నట్లు అయింది.