నర్సంపేట, ఆగస్టు 17: స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చాలని, రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణదానం చేసినట్లేనని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు నర్సంపేట పట్టణంలో బుధవారం టీఆర్ఎస్ యూత్ విభాగం, ప్రభుత్వ దవాఖాన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం చేయడం వల్ల ఎంతో మందికి మేలు జరుగుతుందన్నారు. రక్తం లభించని పరిస్థితిలో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తలసేమియా, రక్తహీనత, రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారు, ఆపరేషన్లలో రక్తం అవసరమయ్యే ఎంతో మంది రోగులు ఉన్నారని తెలిపారు. అలాంటి వారందరూ బ్లడ్ బ్యాంక్ల్లో సంప్రదించి రక్తం తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
యువత రక్తదానం చేయడం వల్ల చాలా మంది ప్రాణాలను కాపాడొచ్చన్నారు. ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని పెద్ది అన్నారు. వారి త్యాగాలకు గుర్తుగా రక్తదాన శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిబిరంలో యువత, టీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారని వెల్లడించారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్, నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, ఆర్డీవో పవన్కుమార్, డిప్యూటీ డీఎంహెచ్వో ప్రకాశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాయిడి దుశ్యంత్రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, డాక్టర్ మనోజ్లాల్, డాక్టర్ విరీన్ పాల్గొన్నారు. కాగా, నర్సంపేటలోని ఏఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎర్రబోయిన రాజశేఖర్ 24వ సారి రక్తదానం చేశారు. ఆయనను పలువురు అభినందించారు.
యువత రక్తదానం చేయాలి
వర్ధన్నపేట: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడేందుకు యువత రక్తదానం చేయాలని వర్ధన్నపేట ఎంపీపీ అన్నమనేని అప్పారావు అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలోని సీహెచ్సీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని యువకులు, ఉద్యోగులు రక్తదానం చేశారు. వారికి ఎంపీపీ, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, తాసిల్దార్ నాగరాజు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. రక్తదానం చేస్తే ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహస్వామి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
రక్తదానం సామాజిక బాధ్యత
నల్లబెల్లి: రక్తదానం చేయడం యువత సామాజిక బాధ్యతగా భావించాలని డిప్యూటీ డీఎంహెచ్వో ప్రకాశ్ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా డివిజన్కేంద్రంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మేడెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి శశికుమార్ పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్వో మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేసినవారమవుతామని తెలిపారు. నల్లబెల్లి మండలం నుంచి ఎక్కువగా రక్తదానం చేసేందుకు ముందుకొస్తాయని తెలిపారు. వారందరికీ ఆరోగ్య శాఖ తరఫున ప్రకాశ్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారులు నగేశ్, నవీన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
బెటాలియన్లో రక్తదాన శిబిరం
కరీమాబాద్: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం మామునూరులోని 4వ బెటాలియన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కమాండెంట్ శివప్రసాద్రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడొచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానంపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.