వరంగల్, ఆగస్టు 17: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయ ఆవరణలో అశోక స్తూపం నిర్మించనున్నారు. ఈ మేరకు బుధవారం గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య స్థలాన్ని పరిశీలించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల చిహ్నంగా బల్దియా ఆవరణలో అశోక స్తూపం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20లోగా స్తూపం నిర్మాణం పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట సీహెచ్వో శ్రీనివాసరావు, డీఈలు రవికుమార్, సంజయ్ ఉన్నారు.
దసరా రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి
అండర్రైల్వేగేట్ ప్రాంతం 40వ డివిజన్ పరిధిలోని దసరా రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని కార్పొరేటర్ మరుపల్ల రవి కోరారు. ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన కమిషనర్ ప్రావీణ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. నిత్యం రద్దీగా ఉండే దసరా రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, సాకరాశికుంట నుంచి గవిచర్ల క్రాస్రోడ్డు వరకు నిర్మిస్తున్న స్మార్ట్రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. డ్రైనేజీల నిర్మాణాలు నెలల తరబడి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. పనుల్లో వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరారు.