పాలకుర్తి/పాలకుర్తిరూరల్/కొడకండ్ల, ఆగస్టు10: పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలోనే పండుగలకు గుర్తింపు లభించిందని, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా బోనాలు నిలుస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం పాలకుర్తిలోని పోచమ్మ తల్లికి నిర్వహించిన బోనాల వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్క నాటారు. దర్దేపల్లిలో దండెమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం కొడకండ్ల మండలం రంగాపురంలో ముత్యాలమ్మ తల్లి వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రావణమాసంలో నిర్వహించే బోనాలను మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, చెరువులు నిండి సమృద్ధిగా పంటలు పండుతున్నాయని చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని వివరించారు. దండెమ్మ తల్లి ఆశీస్సులు, సీఎం కేసీఆర్ సహకారంతో పాలకుర్తి నియోజక వర్గ ప్రజల అభిమానంతో మంత్రినయ్యానని తెలిపారు. కార్యకర్తలను, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. దర్దేపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, దండెమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పాలకుర్తిలోని పోచమ్మ తల్లి ఆలయానికి ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు, ఆలయంపై గోపురం నిర్మిస్తామన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ నల్లానాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పసునూరి నవీన్కుమార్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్, పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కురాంబాబు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, మారుజోడు సంతోష్కుమార్, మేడారపు సుధాకర్, ఉపసర్పంచ్ చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.