రాయపర్తి, జూలై 24: మండలంలోని మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ స్పిల్ వే గేట్లను ఇంచు మేర ఎత్తి జలాలను దిగువకు విడుదల చేసినట్లు ఎస్సారెస్పీ ఈఈ ఆర్ రమేశ్బాబు తెలిపారు. ఆదివారం ఎస్సీరెస్పీ డిప్యూటీ ఈఈ కిరణ్కుమార్, ఏఈలు బాలదాసు, నంద కిశోర్తో కలిసి ఆయన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయ ప్రధాన కాల్వ నుంచి జల ప్రవాహం రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో రూపంలో అధికంగా ఉన్నట్లు చెప్పారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకున్న నేపథ్యంలో స్పిల్వే ఇరు గేట్లను ఇంచు ఎత్తు మేర పైకి ఎత్తి మిగులు జలాలను దిగువకు వదులుతున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు గమనించి సహకరించాలని కోరారు.
ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి
మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ స్పిల్వే గేట్లను ఎత్తి జలాలను దిగువకు విడుదల చేసినందున రిజర్వాయర్ దిగువ ప్రాంతంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలని తాసిల్దార్ కుసుమ సత్యనారాయణ కోరారు. దిగువ ప్రాంతంలోని రాగన్నగూడెం, గణేశ్కుంటతండా, పెర్కవేడు, గట్టికల్, కొండాపురంలోని చెరువులు, కుంటలు, వాగులు, తోగులు విడుదల చేసిన రిజర్వాయర్ జలాలతో అలుగు పోస్తుండడంతోపాటు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యే ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా దిగువ ప్రాంతంలో నాటు వేసే పనుల్లో నిమగ్నమై ఉండే రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తమ పశుసంపదను గడ్డ ప్రాంతాలకు చేర్చుకోవాలని కోరారు. ప్రమాదకర పరిస్థితులు ఉంటే రెవెన్యూ, పోలీస్ అధికారులకు చెప్పాలని కోరారు.