వరంగల్, జూలై 6 (నమస్తే తెలంగాణ) :ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమం ద్వారా జిల్లాలో ఈ ఏడాది 25.92 లక్షల మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాఖల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో అధికారులు ప్రణాళిక రూపొందించారు. కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటికే సుమారు రెండున్నర లక్షలకుపైగా మొక్కలు నాటినట్లు అధికారులు వెల్లడించారు.
ఈసారి ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాల్వ గట్లపై మొక్కలు నాటడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టడం విశేషం. పచ్చదనం పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. 2015 జూలై 3న రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి ఏటా ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా కోట్ల మొక్కలను నాటుతుంది. ఆయా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో ఈ మొక్కలను పెంచుతున్నది. వీటిని ప్రతి సంవత్సరం వానకాలంలో నిర్దేశిత ప్రదేశాల్లో అధికారులు నాటుతున్నారు.
ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మొదట 24.35 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. పచ్చదనం శాతం తక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించిన దృష్ట్యా ఇటీవల జిల్లా టార్గెట్ను 25,92,224కు పెంచింది. హరితహారం కార్యక్రమం అమల్లో పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖలు కీలకపాత్ర వహించనున్నాయి. టార్గెట్లో పంచాయతీశాఖ అగ్రభాగాన ఉంది.
ఈ శాఖకు నిర్దేశించిన మొక్కల టార్గెట్ 7,13,724. గ్రామీణాభివృద్ధి శాఖ మొక్కల లక్ష్యం 5.85 లక్షలు. జీడబ్ల్యూఎంసీ లక్ష్యం 5 లక్షల మొక్కలు. సెరికల్చర్ డిపార్టుమెంట్ మొక్కల టార్గెట్ 1.40 లక్షలు. ఎక్సైజ్శాఖ 1.33 లక్షలు, వ్యవసాయశాఖ లక్ష, వర్ధన్నపేట మున్సిపాలిటీ 90 వేలు, నర్సంపేట మున్సిపాలిటీ 81 వేలు, ఉద్యానశాఖ 75 వేలు, జిలా విద్యాశాఖ 52,240, అటవీశాఖ 50 వేల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. మైన్స్ అండ్ జియాలజీ, పశుసంవర్థక, పరిశ్రమలు, పౌరసరఫరాలు, మార్కెటింగ్, మత్స్య, సహకార, సంక్షేమ శాఖతో పాటు మైనారిటీ, గిరిజన, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖలకు కూడా మొక్కలు నాటడంపై టార్గెట్ ఇచ్చింది. లక్ష్యం మేరకు నాటేందుకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ నర్సరీల్లో కొద్ది నెలల నుంచి వివిధ రకాల మొక్కలను పెంచింది.
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక నర్సరీ, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో వార్డుకో నర్సరీని మొక్కలు పెంచేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హరితహారం కార్యక్రమం కోసం తొలుత ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సరీలో పదకొండు వేల మొక్కలు పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ లెక్కన అధికారులు పదకొండు మండలాల్లోని 323 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టారు. తర్వాత అదనంగా మండలానికో లక్ష మొక్కలను పెంపకం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలు, జీడబ్ల్యూఎంసీ పరిధిలోని నర్సరీల్లోనూ అధికారులు నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కల పెంపకం చేపట్టారు.
ఈసారి కాల్వగట్లపై నజర్
హరితహారం కార్యక్రమం అమల్లో భాగంగా ప్రభుత్వం ఏటా ఏదో ఒక సరికొత్త కార్యక్రమాన్ని రూపొందిస్తున్నది. ఆరంభంలో రైతుల పొలం గట్లపై, తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల ఆవరణలు, పల్లె ప్రకృతి వనాలు, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటే మియావాకీ విధానం, అనంతరం బృహత్ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాల్లో మొక్కలు నాటడం ద్వారా ఏటా ఒక విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
ఈ ఏడాది నూతనంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద, కాలువ గట్లపై ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలోని ఎస్సారెస్పీ, దేవాదుల ప్రాజెక్టు ప్రధాన, ఉప కాల్వలపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ రెండు ప్రాజెక్టులకు చెందిన ప్రతి మెయిన్, మైనర్ కాల్వల గట్ల రహదారి పక్కన పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే దిశగా ముందుకు వెళ్తున్నారు.
ఎందుకంటే జిల్లాలో కాకతీయ మెయిన్ కాల్వతో పాటు డీబీఎం, మైనర్ కాల్వలు చాలా ఉన్నాయి. వీటికితోడు వర్ధన్నపేట, సంగెం, ఖిలావరంగల్ తదితర మండలాల పరిధిలో దేవాదుల ప్రాజెక్టు మైనర్ కాల్వలు కూడా ఉన్నాయి. దీంతో కాల్వ గట్లు, రహదారుల పక్కన పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు అధికారులు ప్లాన్ చేశారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణంల చుట్టూ కూడా మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించింది. ప్రతి క్రీడా ప్రాంగణం చుట్టు 300 మొక్కలు నాటాలని సూచించింది. పల్లె ప్రకృతి వనాల్లో కూడా అవసరమైన మొక్కలు నాటాలని ఆదేశించింది.
వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటికే రెండున్నర లక్షలకుపైగా మొక్కలు నాటినట్లు డీఆర్డీవో ఎం సంపత్రావు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నట్లు డీఆర్డీవో చెప్పారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ఇంటికో ఆరు మొక్కలను అందజేసే కార్యక్రమం కూడా ప్రారంభమైంది.