హనుమకొండ, జూలై 6 : నేటి నుంచి ప్రారంభం కానున్న కాకతీయ వైభవ సప్తాహాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. సప్తాహం ఏర్పాట్లు, నిర్వహణపై బుధవారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాకతీయుల గొప్ప చరిత్రను భావితరాలకు అందించాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు కాకతీయ వైభవ సప్తాహ ఉత్సవాలు పండగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కాకతీయులకు 7 సెంట్మెంట్ అయినందున కాకతీయ వైభవ సప్తా హం ఏడు తరాలకు గుర్తుండేలా ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు ఏడు రోజుల పాటు కన్నుల పండగలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 700 సంవత్సరాల క్రితం ఓరుగల్లును వీడి వెళ్లిన కాకతీయులు ఛత్తీస్గఢ్లోని బస్తర్లో ఉన్నట్లు చరిత్రకారుల ద్వారా తెలుసుకొని ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకులకు 22వ వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ను ఆహ్వానించినట్లు తెలిపారు.
ఆయన నేడు ఉదయం 7.30 నుంచి 8గంటల మధ్య హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన వరంగల్లోని భద్రకాళి ఆర్చ్ వద్దకు చేరుకుంటారన్నారు. మొదటి రోజు గురువారం కార్యక్రమాల్లో భాగంగా భద్రకాళి ఆర్చ్ నుంచి 600మంది జానపద, పేరిణి శివతాండవం, ఒగ్గుడోలు కళాకారులతో కాకతీయుల వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ను స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భద్రకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని పూజ లు నిర్వహించి అక్కడినుంచి పోచమ్మైదాన్లోని రాణీరుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేస్తారని అక్కడినుంచి ఖిలా వరంగల్ను వెళ్తారని చెప్పారు.
తిరిగి వచ్చే మార్గంలో వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించి పునః నిర్మాణ పనులను పరిశీలించి రుద్రేశ్వరస్వామికి పూజ లు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అక్కడినుంచి కాకతీయుల మొదటి రాజధానిగా భావిస్తున్న అగ్గలయ్యగుట్ట ప్రాంతంలోని నాలుగు పూర్తి కాని ఆర్చిలను పరిశీలిస్తారన్నారు. అనంతరం కాకతీయ హరిత హోటల్లో భోజన చేసిన తర్వాత హైదరాబాద్కు వెళ్లి స్టేట్గ్యాలరీలో 777 ఫొటోలు, 777 పురాతన నాణాల ఎగ్జిబిషన్ను మంత్రి కేటీఆర్తో కలిసి ప్రారంభించి పరిశీలిస్తారని దాస్యం చెప్పారు.
షెడ్యూల్ ప్రకారం నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో నాటక ప్రదర్శన, అంబేదర్ భవన్లో కవి సమ్మేళనం, శాస్త్రీయ సంగీత కచేరీ, వడ్డేపల్లి బండ్పై వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లా చందుపట్ల, నకిరేకల్లో ఉత్సవాలు నిర్వహించడం తో పాటు హనుమకొండలో సాయంత్రం భద్రకాళి బండ్పై తెలంగాణ ప్రత్యేక వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పా టు చేస్తామన్నారు. నల్గొండ జిల్లా పానగల్లు ఆలయంలో చరిత్రకారులు, మేధావులతో వేడుకలు ఉంటాయన్నారు. 11న పానగల్లుకు వెళ్లాలనుకునే చరిత్రకారులు, మేధావులు, ఔత్సాహికులు కలెక్టరేట్లో పేర్లు నమోదు చేసుకోవాలని చీఫ్ విప్ కోరారు.
నిట్లో మిషన్ కాకతీయ, కాకతీయుల ఐడియాలజీపై సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వేడుకల చివరి రోజు 13న రామప్ప ఆలయం వద్ద కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శనలతో వేడుకలు ముగుస్తాయని ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రానున్నట్లు వివరించారు. టెంపుల్, ట్యాంకు, టౌన్ చుట్టే కాకతీయుల పాలన ప్రజారంజకంగా సాగిందన్నారు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు, శిథిలావస్థలో ఉన్న ఆలయాలను తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించిందని పేర్కొన్నారు.
చరిత్రకారులు, సీఎం కేసీఆర్ కృషితో రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందని వినయ్భాస్కర్ తెలిపారు. వేడుకల్లో ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అనంతరం మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్, హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్ తదితరులతో కలిసి కమల్చంద్ భంజ్దేవ్ పర్యటించే అగ్గలయ్యగుట్ట, తదితర ప్రాంతాలను దాస్యం పరిశీలించారు. సమావేశంలో మైనార్టీ నాయకుడు నయీమొద్దిన్ పాల్గొన్నారు.