పోచమ్మమైదాన్, జూలై 6: వరంగల్ జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉందని, రోడ్డు, రైల్వే, ట్రాన్స్ఫోర్టు వసతులు అందుబాటులో ఉన్నాయని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ అధికారులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఇన్నోవేషన్ సెల్ ప్రధాన కార్యదర్శి తౌటం శాంత, ముంబై బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ ఆలన్ గెమ్మెల్ ఒటే, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్తోపాటు హైదరాబాద్ హెడ్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్మెంట్స్ అధికారులు వరంగల్ జిల్లాలోని గొర్రెకుంటతోపాటు పరిసర ప్రాంతాలను బుధవారం పరిశీలించారు.
వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు బొమ్మనేని రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి మడూరి వేదప్రకాశ్ ఆధ్వర్యంలో గొర్రెకుంట లోని కరాణి స్పైసెస్ పరిశ్రమను సందర్శించారు. ఈ సందర్భంగా పరిశ్రమ యజమాని రాజేశ్ను పరిశ్రమ గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ లో వ్యవసాయ ఆధారిత, ఇతర పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉన్న సదుపాయాలను అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్లో గనేశ్ ఎకోపెట్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను కూడా సందర్శించి పరిశ్రమల స్థాపనకు అవసరమైన ముడిసరుకు, ఎలక్ట్రిసిటీ, రోడ్డు, రైలు మార్గాలు, రవాణా సౌకర్యాల గురించి చాంబర్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ తర్వాత దినదినం అభివృద్ధి చెందుతున్న వరంగల్లో పరిశ్రమల స్థాపన కోసం వారు సుముఖత వ్యక్తం చేసినట్లు చాంబర్ అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు.
వేయిస్తంభాల గుడి సందర్శన
హనుమకొండ చౌరస్తా: చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయాన్ని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, యూకే ట్రేడ్ కమిషనర్ అలెన్ జమ్మెల్ బుధవారం సందర్శించారు. వారికి ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. రుద్రేశ్వరుడి దర్శనం కల్పించి ఆలయ నాట్యమంటపంలో తీర్థప్రసాదాలు, స్వామివారి శేషవస్ర్తాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాశస్థాన్ని వారికి గైడ్కు తెలుగులో వివరిస్తే వారు ఇంగ్లిష్లో అనువందించారు. గ్రేట్ ఆర్కిటెక్ అంటూ ఆలయాన్ని తిలకించారు.