వరంగల్, జూలై 6: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కాకతీయ వైభవ సప్తహం వేడుకలను విజయవంతం చేయాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం కార్పొరేషన్లో మెప్మా సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో కాకతీయ సప్తహం వేడుకల విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు కాకతీయ సప్తాహం వేడుకలను ప్రభుత్వం వైభవంగా నిర్వహించనుందని తెలిపారు. మెప్మా నుంచి సీవో, ఆర్పీ, ఓబీసీలు ప్రచారం చేయాలని సూచించారు.
ఇంటింటికీ వేడుకల కరపత్రాలను పంపిణీ చేయాలన్నారు. వేడుకల ప్రారంభం రోజైన గురువారం కాకతీయుల 22వ వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకోనున్నందున మెప్మా సిబ్బంది డ్రెస్ కోడ్తో ఉదయం 7.30 గంటలకు భద్రకాళీ ఆర్చిగేట్ వద్దకు చేరుకొని ఘనంగా స్వాగతం పలుకాలన్నారు. కాకతీయుల చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నందున విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. 9, 10 తేదీల్లో భద్రకాళీ బండ్పై కార్నివాల్, ఫుడ్ ఫెస్టివల్, 7నుంచి 10 వరకు వేయిస్తంభాల గుడి, ఖుష్మహల్ ప్రాంతాల్లో ఫుడ్ ఫెస్టివల్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. నగర ప్రజలు కాకతీయ సప్తహం వేడుకల్లో భాగస్వాములు అయ్యేలా మెప్మా సిబ్బంది ప్రచారం కల్పించాలన్నారు. ఈ సమావేశంలో టీఎంసీ రమేశ్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు పాల్గొన్నారు.