ఖిలావరంగల్, జూలై 5: కాకతీయుల కళావైభవం ఉట్టిపడేలా సప్తాహ వేడుకలను నిర్వహిస్తామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కలెక్టర్ బీ గోపి అన్నారు. మంగళవారం గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి వేడుకలు నిర్వహించే వేదికలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేడుకలను హాజరవుతున్న కాకతీయుల 22వ వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ను ఘనంగా స్వాగతిస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 7న ఉత్సాహభరితమైన వాతావరణంలో కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
కాకతీయ రాజులు చేపట్టిన అభివృద్ధిని ఈ ఏడు రోజుల్లో వివరిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం కాకతీయులను ఆదర్శంగా తీసుకొని గొలుసుకట్టు చెరువులు, ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీ హరిసింగ్, డీటీఓ శివాజీ, ఏఎస్ఐ కోట కోఆర్డినేటర్ కొత్తపెల్లి శ్రీకాంత్, ఆర్డీఓ మహేందర్జీ, తహసీల్దార్ ఫణికుమార్, మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్యాదవ్, టీఆర్ఎస్ నాయకులు సంగరబోయిన చందర్, సంగరబోయిన ఉమేశ్, నలింగటి అభిషేక్, బోగి సురేశ్, ఎండీ ఉల్ఫత్, మంద శ్రీధర్రెడ్డి, కాసుల ప్రతాప్, కొత్తపల్లి శ్రీనివాస్, సంగరబోయిన విజయ్, పోశాల సురేశ్, మైదం నరేశ్, మేకల ఎల్లయ్య, గైడ్ రవియాదవ్ తదితరులు పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి: కలెక్టర్ గోపి
కాకతీయ వైభవ సప్తాహం వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ కలెక్టర్ బీ గోపి ఆదేశింంచారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు ఖుష్మహల్ ప్రాంగణంలో సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందుకు తగ్గట్టుగా కళాకారుల బృందాలను ఎంపిక చేయాలని సూచించారు. మండల, జిల్లాస్థాయిలో కాకతీయుల చరిత్రపై వ్యాసరచన, పెయింటింగ్, కవిత్వం, తదితర పోటీలు నిర్వహిస్తామన్నారు. గెలుపొందిన విద్యార్థులకు వేడుకల్లో బహుమతులు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బీ హరిసింగ్, శ్రీవత్స పాల్గొన్నారు.