గణపురం, జూలై 5 : కాకతీయ వైభవ సప్తాహం వేడుకలను ఘనంగా నిర్వహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా ఆదేశించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12న కాకతీయ కళాక్షేత్రం శ్రీ భవానీసహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో నిర్వహించనున్న కార్యక్రమాల ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆలయ పరిరక్షణ సమితి, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో ఉత్సవాల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 12న గణపేశ్వరాలయంలో సప్తాహం నిర్వహిస్తామని సుమారు వెయ్యేళ్ల కిందట నిర్మించిన ఈ ఆలయంలో సప్తాహ ఉత్సవాలను అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలంతా కలిసికట్టుగా పాల్గొని ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు.
ప్రాచీన ఆలయాల్లో ఇలాంటి ఉత్సవాలు నిర్వహించడం వల్ల కట్టడాలకు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని, గణపురం టూరిజం హబ్గా మారుతుందన్నారు. ఉత్సవాల్లో కాకతీయుల సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలు చేపట్టి, తెలంగాణ అభిరుచులను సమాజానికి తెలియాజేసేలా ఫుడ్స్టాల్స్ ఏర్పాటుచేస్తామని చెప్పారు. సమయం తక్కువగా ఉన్నందున పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభారాణి, డీపీఓ ఆశాలత, ఉమ్మడి జిల్లా పురావస్తుశాఖ ఏడీ మల్లునాయక్, ఎంపీడీఓ అరుంధతి, తహసీల్దార్ సతీశ్కుమార్, గణపురం సర్పంచ్ దేవేందర్గౌడ్, ఎంపీటీసీ శివశంకర్ గౌడ్, వైస్ ఎంపీపీ అశోక్, మల్లికార్జున్గౌడ్, యాదగిరిగౌడ్, చోటేమియా పాల్గొన్నారు.