హనుమకొండ, జూలై 4 : కాకతీయుల వైభవం ప్రతిబింబించేలా కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలను ఏడు తరాలకు గుర్తుండిపోయేలా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కాకతీయ వైభవ సప్తాహం నిర్వహిస్తున్న సందర్భంగా సోమవారం మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని ప్రగతిభవన్లో పర్యాటక, క్రీడలు సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్, పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాకతీయ సప్తాహాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని, కాకతీయుల చరిత్రను ప్రజలకు తెలియజేసేలా వినూత్న కార్యక్రమాలు రూపొంచాలన్నారు. ఇందుకు కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఈమేరకు అధికారు లు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఏడు రోజులు పండుగలా నిర్వహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.