పర్వతగిరి, జూలై 4 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని మూడెత్తుల తండా, మాల్యాతండా, గుగులోత్ తండా, ఏనుగల్ గ్రామాల్లో రూ.4కోట్లతో చేపట్టిన వైకుంఠధామాలు, డంపింగ్యార్డులు, అంతర్గత సీసీ రోడ్లు, శ్రీనగర్, ఏనుగల్ గ్రామాల్లో రైతు వేదికలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు.
ఇందులో భాగంగా ప్రతి నెలా జీపీలకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పల్లె ప్రగతిలో భాగంగా ఇప్పటికే పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఎప్పటికప్పుడు పనులను గుర్తించి పూర్తి చేయాలని సూచించారు. అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్లు పూర్తయ్యాయని, త్వరలోనే వాటిని ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కమల పంతులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శాంతిరతన్రావు, ఏకాంతంగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్గౌడ్, గొర్రె దేవేందర్, వైస్ ఎంపీపీ రాజేశ్వర్రావు, ఆర్పీఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్లు సంధ్యారాణి, సుజాత, మూడు జ్యోతి, ఎంపీటీసీలు కోల మల్లయ్య, భాస్కర్ పాల్గొన్నారు.
మంత్రి ఎర్రబెల్లికి జన్మదిన శుభాకాంక్షలు..
మంత్రి ఎర్రబెల్లి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే అరూరి ఏనుగల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. మంత్రి ఎర్రబెల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కల్వర్టు పనులు ప్రారంభం..
పోచమ్మమైదాన్ : వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ ఎనుమాములలో పైప్లైన్ కల్వర్టు నిర్మాణ పనులను ఎమ్మెల్యే అరూరి ప్రారంభించారు. రూ.35లక్షలతో దీన్ని నిర్మించనున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తూర్పాటి సులోచన-సారయ్య, డివిజన్ అధ్యక్షుడు ముడుసు నర్సింహ, ప్రధాన కార్యదర్శులు ఎండీ ఆజం, పత్రి సుభాష్, మహిళా అధ్యక్షురాలు మాధవి, నాయకులు గోవింద్, యాదగిరి, మల్లయ్య, రాజ పోశాలు, సలీం, అఫ్జల్, చిలువేరు శ్రీను, స్టాలిన్ పాల్గొన్నారు.