తొర్రూరు, జూలై 3 : తొర్రూరు డివిజన్ కేంద్రంలో పోలీస్, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా సుమారు 3 గంటల పాటు బడి బయట ఉన్న పిల్లలను గుర్తించేందుకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పర్యటించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యా శాఖ ఆధ్వర్యంలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థుల వివరాల సేకరణ కార్యక్రమాన్ని ఇటీవల పూర్తి చేశారు. దీని ఆధారంగా బడికి వెళ్లకుండా పనికి వెళ్తున్న బడీడు పిల్లలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. సా యినగర్ పరిసర ప్రాంతాల్లో 20 మంది పిల్లలు బడికి వెళ్లకుండా వివిధ పనులకు వెళ్తున్న తీరును గుర్తించి, వారందరిని పాఠశాలలకు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎవరైనా బడీడు పిల్లలను పనిలోకి పంపితే చట్ట ప్రకారం.. చర్య తీసుకుంటామని సీఐ సత్యనారాయణ, ఎంఈవో గుగులోత్ రాము హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జీ సతీశ్, తొర్రూరు హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు పోగు శ్రీనుబాబు, బీ వెంకటేశ్వర్లు, అంబేద్కర్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సీహెచ్ రాజసుకన్య, సరిత, సీఆర్పీ కల్పన పాల్గొన్నారు.