జయశంకర్ భూపాలపల్లి, జూలై 3 (నమస్తే తెలంగాణ): సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాయి. ప్రస్తుతం క్యారీ బ్యాగులు, కవర్లు, గ్లాసులు, తదితరాల వాడకం బాగా పెరగడం అనేక అనర్థాలకు దారితీస్తోంది. దీంతో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, కవర్లు 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండొద్దని ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈమేరకు అధికారులు కొద్ది రోజులుగా భూపాలపల్లి మున్సిపాలిటీలోని షాపులు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, మాంసం దుకాణాలపై దాడులు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమందికి జరిమానాలు విధించారు. మరోవైపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వాడకంతో కలిగే అనర్థాలను వివరిస్తున్నారు. షాపుల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపే కార్యాచరణ అమలు చేస్తున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులైన క్యారీ బ్యాగులు, కవర్లు, గ్లాసులు, తదితరాల వాడకం విచ్చలవిడిగా పెరిగింది. దీంతో వీటివల్ల అనేక అనర్థాలు, పర్యావరణ కాలుష్యం, మనుగడకు ముప్పు ఏర్పడనుంది. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను ఇక నుంచి ప్రభుత్వ నిబంధనల మేరకే తయారు చేయాలని, 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న క్యారీ బ్యాగులు వాడినా, విక్రయించినా అధికారులు కఠినచర్యలు తీసుకోనున్నారు. భూపాలపల్లి జిల్లాలోని మున్సిపాలిటీతోపాటు 241 గ్రామ పంచాయతీల్లో ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాలను ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నారు. భూపాలపల్లి పట్టణ పరిధిలోని పలు షాపులు, ఫంక్షన్ హాళ్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ మున్సిపల్ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు దృష్టిసారిస్తున్నారు.
వ్యాపార సముదాయాలపై నజర్
జిల్లా కేంద్రంలోని వర్తక, వ్యాపార సముదాయాలు, మటన్, చికెన్, కూరగాయలు, పండ్లు, వీధి వ్యాపారాలు చేస్తున్న వారితోపాటు సూపర్ మార్కెట్లు, కిరాణ, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వాడుతున్నారు. దీంతో నివారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారు పర్యటిస్తూ జరిమానాలు విధిస్తున్నారు. 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం గల క్యారీ బ్యాగులను విక్రయించిన వారికి రూ.2500 నుంచి రూ.25వేల వరకు జరిమానాలు విధించే అవకాశాలు ఉన్నాయి.
రెండు రోజుల్లో 15 మందికి..
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వాడకంపై నిషేధాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు మున్సిపాలిటీ పరిధిలో రెండు రోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల్లో 15 మందికి జరిమానాలు విధించారు. ప్రస్తుతం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను వాడుతున్న, విక్రయిస్తున్న వారి నుంచి ప్లాస్టిక్ క్యారీ స్వాధీనం చేసుకుంటూ అవగాహన కల్పిస్తున్నారు. 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న క్యారీబ్యాగులను వినియోగించొద్దని హెచ్చరిస్తున్నారు.
దాడులు చేస్తున్నాం
ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్కు అనుగుణంగా మున్సిపాలిటీ పరిధిలో రోజులుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిషేధం అమలుకు దాడులు చేస్తున్నాం. 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్నవి వినియోగించొద్దని చెబుతున్నాం. ఫంక్షన్హాల్, కిరాణా షాపులు, సూపర్ మార్కెట్ల యజమానులకు నోటీసులు జారీ చేశాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను అమ్మినా, వాడినా, తయారు చేసినా జరిమానాలు విధిస్తాం.
– ప్రశాంతి, శానిటరీ ఇన్స్పెక్టర్,భూపాలపల్లి మున్సిపాలిటీ