భూపాలపల్లి టౌన్, జూలై 3: జీఎంఆర్ ట్రస్టు ద్వారా కోచింగ్ తీసుకొని టెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ ఉచిత డీఎస్సీ శిక్షణ ప్రారంభిస్తామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జ్యోతి దంపతులు వెల్లడించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గండ్ర దంపతులు శాలువాలతో సన్మానించారు. సుమలత 108 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచారని, కావ్య 107, వెన్నెల 105, వేణుకుమార్ 100 మార్కులు సాధించారని వివరించారు. జీఎంఆర్ఎం ద్వారా తాము ఇప్పించిన ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని 80 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు కావడంపై అభినందించారు. జీఎంఆర్ఎం ట్రస్టు ద్వారా అంబులెన్స్, వైకుంఠ రథం, వంద పడకల ఆసుపత్రిలో పేషెంట్ల అటెండర్లకు ఉచిత మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ఉచితంగా శిక్షణ ఇచ్చిన జీఎంఆర్ఎం ట్రస్టు వ్యవస్థాపకులకు టెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కోచింగ్ ఇన్చార్జి బుర్ర రమేశ్, కోచింగ్ నిర్వాహకులు పాల్గొన్నారు.