సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. బుధవారం సంగెం మండలం ఆశాలపల్లి, తీగరాజుపల్లి, సోమ్లాతండా, మొండ్రాయి, గొల్లపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, కలెక్టర్ గోపితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడారు. సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడేది సీఎం కేసీఆరేని, ఆయన సేవలను గుర్తించి ఆశీర్వదించాలని కోరారు. రైతుల అభిప్రాయాల మేరకు ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దుచేశామని, ఈ విషయాన్ని గమనించాలన్నారు.
సంగెం, జూన్ 29 : ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి కోసం ‘మన ఊరు-మన బడి’ ద్వారా కోట్లాది నిధులు కేటాయించి ప్రైవేటుకు దీటుగా ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన అందిస్తున్నామని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పిల్లలను సర్కారు బడుల్లోనే చదివించాలని కోరారు. బుధవారం సంగెం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు.
మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలకు 43లక్షలు నిధులు కేటాయించగా పనులకు శంకుస్థాపన చేశారు. 80లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, రూ.10లక్షలతో వైకుంఠధామం, రూ.2.5లక్షలతో కట్టిన డంపింగ్ యార్డులను ప్రారంభించారు. మహిళా సంఘాలకు రూ.3కోట్ల 20లక్షల చెక్కును మంత్రి అందజేశారు. అనంతరం విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
ఆశాలపల్లిలో 286 ఆసరా పించన్లు, 720మందికి రైతుబంధు, 44 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా నిధులు, 44మందికి వడ్డీలేని రుణాలు, 24 కేసీఆర్ కిట్లు, ముగ్గురు రైతులకు రైతుబీమా, రూ.10కోట్లతో గ్రామంలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు వివరించారు. వేరే రాష్ర్టాలవారు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి గొప్పగా పొగుడుతున్నారని చెప్పారు. వచ్చే నెల నుంచే కొత్త పింఛన్లు ఇస్తారని చెప్పారు.
వ్యవసాయ బావుల వద్ద కరెంటు మోటర్లకు మీటర్లు పెట్టాలని సీఎం కేసీఆర్పై ప్రధాని మోదీ ఒత్తిడి తెస్తున్నా రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఒప్పుకోలేదన్నారు. ల్యాండ్ పూలింగ్ను రద్దు చేసి జీవో ఇచ్చామని రైతులు గమనించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
కార్యక్రమంలో రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి, అదనపు కలెక్టరర్ హరిసింగ్, డీఆర్డీఓ ఎం.సంపత్రావు, డీపీఓ స్వరూపరాణి, డీఈవో వాసంతి, ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, సర్పంచ్లు బి.కిషోర్యాదవ్, మంగ్యానాయక్, కర్జుగుత్త రమ-గోపాల్, మేరుగు మల్లేశం, గూడ కుమారస్వామి, ఇజ్జగిరి స్వప్న-అశోక్, ఎంపీటీసీలు చిదిరాల రజిత, రంగరాజు నర్సింహస్వామి, కొనకటి రాణి-మొగిలి, ఎంపీడీఓ ఎన్.మల్లేశం, తహసీల్దార్ రాజేంద్రనాథ్, ఎంపీఓ కొమురయ్య, ఎంఇఓ ఎన్.విజయ్కుమార్, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి పాల్గొన్నారు.
సమగ్రాభివృద్ధికే పల్లె ప్రగతి
– పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
గ్రామాల సమగ్రాభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టి పక్కా అమలుచేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దాని ఫలితంగానే మన పల్లెలు దేశంలోనే ఉత్తమ జీపీలుగా ఎంపికయ్యాయని ఇది ముఖ్యమంత్రి ఘనతేనని చెప్పారు. వ్యవసాయం దండుగన్న రోజుల నుంచి పండుగలా మార్చారని.. అందుకు రైతులంతా ఆయన రుణపడి ఉంటారని పేర్కొన్నారు. దళితబంధు పథకం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దేశంలోనే పెద్ద టెక్స్టైల్ పార్క్ను ఇక్కడ ఏర్పాటుచేయడం వల్ల నాలుగు కంపెనీలు పనులు ప్రారంభించాయని వాటిలో స్థానిక యువతకే పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
‘మన బడి’లో భాగస్వాములు కావాలి..
– ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి
తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామ రక్ష అన్ని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మన ఊరు-మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ప్రైవేట్కు దీటుగా మార్చుతున్నట్లు తెలిపారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి విద్యార్థుల భవితకు గట్టి పునాది వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని.. ఇందులో ఎంపీటీసీలు, జడ్పీటీసీలను భాగస్వాములు చేయాలన్నారు. సన్మానాలకు చేసే ఖర్చు ఊరి బడికి వెచ్చిస్తే బాగుంటందని అభిప్రాయపడ్డారు.