వరంగల్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఓరుగల్లు కేంద్రంగా తెలుగు మాట్లాడే ప్రాంతం మొత్తాన్ని పరిపాలించిన కాకతీయుల వైభవం, తెలంగాణ సాంస్కృతిక ఘనతను ప్రస్తుత తరానికి తెలియజెప్పేలా కాకతీయ సప్తాహం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాకతీయ ఉత్సవాల నిర్వహణకు ఇది మొదటి అంకంగా ఉండనుంది. కేయూ, నిట్ సమన్వయంతో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
చారిత్రక కట్టడాల సందర్శనతోపాటు సంప్రదాయ, ఆధునిక కార్యక్రమాలు సప్తాహంలో ఉండనున్నాయి. సాంస్కృతిక, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో కాకతీయ సప్తాహం నిర్వహణకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధమైంది. కాకతీయుల సెంటిమెంట్గా భావించే 7 నంబర్ ఆధారంగా సప్తాహం నిర్వహించాలని నిర్ణయించారు. ఏడో నెల, ఏడో తేదీ, ఏడు రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల జాబితా సిద్ధమైంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశం అనంతరం దీనిపై ప్రభుత్వ పరంగా అధికారిక ప్రకటన వెలువడనుంది.
కాకతీయుల పరిపాలన అంశాలపై అవగాహన ఉన్న సాహితీవేత్తలు, కవులను ఈ ఉత్సవాల్లో భాగస్వాములను చేసేలా సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్భాస్కర్ ఆహ్వానం వేరకు ఛత్తీస్గఢ్లోని బస్తర్లో ఉంటున్న కాకతీయుల వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ వేడుకలకు రానున్నారు. కాకతీయుల హయాంలో సైనికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పేరిణి నృత్య ప్రదర్శనను ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని దాదాపు అందరు పేరిణి కళాకారులను ఆహ్వానిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాతోపాటు హైదరాబాద్లో కొన్ని కార్యక్రమాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
కార్యక్రమాలు ఇలా..
హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో విద్య, రవాణా శాఖల సమన్వయంతో సప్తాహం నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. కాకతీయ సప్తాహంలో నిర్వహించే కార్యక్రమాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నది. ప్రాథమికంగా నిర్ణయించిన ప్రకారం.. రామప్ప ఆలయం, భద్రకాళి ఆలయం, వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, పాన్గల్ ఆలయాల సందర్శన కార్యక్రమాలు వీటిలో ఉన్నాయి. వేయి స్తంభాల గుడి నుంచి పద్మాక్షి ఆలయం వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు.
సప్తాహం జరిగే ఏడు రోజుల్లో ఐదురోజులపాటు కాకతీయ చారిత్రక సంపద, సాంస్కృతిక వైభవంపై పెయింటింగ్ వర్క్షాపు ఉంటుంది. ఫొటోగ్రఫీ ఫెస్టివల్, షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్, కవి సమ్మేళనం, వ్యాస రచన పోటీలు, కాకతీయ నాటక ఉత్సవాలను నిర్వహించనున్నారు. వీటిలో ఒక్కో కార్యక్రమాన్ని ఒక్కో కాకతీయ కట్టడం వద్ద నిర్వహించేలా ప్రణాళికలు ఉన్నాయి. అంబేద్కర్ భవన్లో భారీ ఎత్తున పేరిణి నృత్య ప్రదర్శన నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడు రోజులపాటు ఇది జరుగనున్నది. కొత్త తరాన్ని ఆకర్షించేలా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సప్తాహం జరిగే అన్ని రోజులు వడ్డేపల్లి ట్యాంకు బండ్పై కార్నివాల్ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వరంగల్ మహానగరానికి కొత్త ఆకర్షణీయ కేంద్రంగా ఉన్న భద్రకాళి బండ్పై ఏడు రోజులపాటు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని భావిస్తున్నారు. కాకతీయ సప్తాహంపై రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ పరంగా నిర్వహించే సమావేశం అనంతరం కార్యక్రమాల జాబితా సిద్ధం కానున్నది.