సుబేదారి, జూన్ 29 : గతంలో నేరాలకు పాల్పడిన వారిపై నిఘా పెట్టాలని వరంగల్ సీపీ తరుణ్జోషి పోలీసు అధికారులకు సూచించారు. బుధవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో ఈస్ట్జోన్ నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీసు స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, కేసుల పురగతి, నేరస్తుల వివరాలను అడిగి తెలసుకున్నారు. ప్రతి పోలీసు స్టేషన్ అధికారి ఎస్వోపీ విధానాన్ని అనుసరించాలని, పెండింగ్ కేసులను పరిష్కరించాలని, నేరస్తులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, నేర రుజువుకు అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించి, కోర్టుకు సమర్పించాలని సూచించారు.
ప్రతి గ్రామాన్ని పోలీసు అధికారులు తరుచుగా సందర్శించి, శాంతిభద్రతలను పర్యవేక్షించాలని, గుట్కా, గుడుంబా, గ్యాంబ్లింగ్ చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అవగాహన సదస్సులు నిర్వహించి, ప్రజలను భాగస్వాములు చేయాలన్నారు. పోలీసు నియామకాల్లో పాల్గొనే విధంగా యువతను ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో ఈస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, ఏసీపీలు సంపత్రావు, నరేశ్కుమార్, శివరామయ్య తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు అండగా ‘భరోసా’ కేంద్రం..
లైంగిక దాడులకు గురైన బాధితులకు భరోసా కేంద్రం అండగా ఉంటున్నదని వరంగల్ సీపీ తరుణ్జోషి అన్నారు. వరంగల్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సుబేదారిలో భరోసా కేంద్రం ఏర్పాటు చేసి బుధవారంతో రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీపీ సెంటర్ను సందర్శించి కేక్ కట్ చేశారు. భరోసా సెంటర్లో రెండు సంవత్సరాల్లో 216 కేసులు నమోదు చేశామని, 186మంది బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా న్యాయసేవాధికార సంస్థ నుంచి రూ.84లక్షలు పరిహారం ఇప్పించామన్నారు. కార్యక్రమంలో క్రైమ్స్, ట్రాఫిక్ డీసీపీ పుష్పారెడ్డి, భరోసా కేంద్రం ఇన్స్పెక్టర్ సువర్ణ, లీగల్ కౌన్సిలర్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు.