పరకాల, జూన్ 27: పరకాల వేదికగా కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమైంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలో నిరసన చేపట్టారు. ఇక్కడ కొండా, ఇనుగాల వర్గీయులు ఆధిపత్యాన్ని చూపేందుకు పోటీపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతోపాటు స్వల్ప తోపులాట జరిగింది. అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన దీక్షకు పిలుపునిచ్చింది. ఇందుకు పార్టీ అధిష్టానం ఇన్చార్జిలను నియమించింది. పరకాలలో నిర్వహించే కార్యక్రమానికి కొండా సురేఖ ఇన్చార్జిగా నియామకమయ్యారు.
పరకాల మున్సిపల్ కార్యాలయం ముందు దీక్ష వేదికను కాంగ్రెస్ నాయకులు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో వివాదం జరిగింది. ఫ్లెక్సీని పట్టణ కాంగ్రెస్ కమిటీ వారు ఏర్పాటు చేయాల్సి ఉండగా, వర్గీయులు ఫ్లెక్సీని తీసుకువచ్చి, వేదికపై ఏర్పాటు చేయడం, ఆ ఫ్లెక్సీలో పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల వెంక ట్రామ్రెడ్డి ఫొటో లేకపోవడంపై ఇనుగాల వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీని వేదికపై ఏర్పాటు చేయొద్దంటూ ఇనుగాల వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేయగా, కొండా వర్గానికి చెందిన కొందరు వాగ్వా దానికి దిగారు. దీంతో కొంత గందరగోళం నెలకొంది. అనంతరం ఫ్లెక్సీ లేకుండానే కార్యక్రమాన్ని కొనసా గించేందుకు ఇరువర్గాలకు చెందిన నాయకులు ఒక అంగీకారానికి వచ్చారు.
సురేఖకు బదులు సుస్మిత హాజరు
పరకాలలో చేపట్టిన నిరసన దీక్షకు ఇన్చార్జిగా కొండా సురేఖను పార్టీ అధిష్టానం నియమించింది. కానీ సురేఖకు బదులు కూతురు కొండా సుస్మిత హాజరయ్యారు. కొండా వర్గానికి చెందిన పలువురు సుస్మితను ముఖ్య అతిథిగా, ఇన్చార్జిగా పేర్కొంటూ ప్రసంగించడంపై ఇనుగాల వర్గీయులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొండా వర్గీయులు తమ ఆధిత్యాన్ని ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని, ఫ్లెక్సీ వేదికపై ఎందుకు ఏర్పాటు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్చార్జి కొండా సురేఖ హాజరు కాకుండా కూతురును పంపడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఇనుగాల వర్గీయులపై కొండా వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.