హనుమకొండ చౌరస్తా, జూన్ 27: మాసశివరాత్రి సోమవారం సందర్భంగా నగరంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేయిస్తంభాల గుడిలో మహాన్యాసపూర్వక పాశుపత రుద్రాభిషేకం, 75 మంది దంపతులతో సామూహిక రుద్రాభిషేకాలు చేయించి, రుద్రేశ్వరీ-రుద్రేశ్వరస్వామికి కల్యాణోత్సవాన్ని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ గీతానాగశ్రీ, అర్చకులు మణికంఠశర్మ, ప్రణవ్ పాల్గొన్నారు.
ఐనవోలులో..
ఐనవోలు : ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థ్ధానంలో మాస శివరాత్రి సందర్భంగా స్వామికి రుద్రాభిషేకం, రుద్రహోమం, కల్యాణం, పెద్ద పట్నం నిర్వహించారు. ఈవో అద్దంకి నాగేశ్వర్రావు, డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్రావు, ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, గట్టు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక జోషి, మాజీ చైర్మన్ మునిగాల సంపత్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
మెట్టుగుట్టపై..
మడికొండ : మెట్టుగుట్టపై స్వయంభూలింగేశ్వరస్వామి ఆలయంలో అర్చకుడు రాగిచేడు అభిలాశ్ శర్మ రుద్రాభిషేకం నిర్వహించారు. సీతారామచంద్రస్వామి ఆలయంలో విశేష అర్చనలు జరిపించారు. యాగశాలలో రుద్రహోమం చేశారు. కార్యక్రమంలో ఈవో వెంకటయ్య, అర్చకులు పరాశరం విష్ణువర్ధనాచార్యులు, పారుపల్లి సత్యనారాయణశర్మ తదితరులు పాల్గొన్నారు.